Amaravati Farmers: మొన్నటి ఎన్నికల్లో జగన్( Jagan Mohan Reddy) ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహం మొదటి కారణం. మరోవైపు అమరావతి రాజధాని రైతుల ఉద్యమం కూడా ప్రధానంగా పనిచేసింది. ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ఈ ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకున్నారు జగన్. రాష్ట్రం మొత్తం సంక్షేమం ఇస్తున్నాం కదా అని.. పదుల సంఖ్యలో గ్రామాల రైతుల ఆవేదనను ఎవరు వింటారులే అని భావించారు. అంతటితో ఆగకుండా వారిని కేసులతో వేధించారు. వారి నిరసన కార్యక్రమాలను అడ్డగించారు. దాడులు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ పరిణామాల క్రమంలో.. అదే పరిస్థితి తమకు వస్తే ఏంటి అని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు భావించారు. వైసీపీ సర్కార్ చర్యలను ఖండించారు. జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు.
* మహిళా రైతుల కీలక పాత్ర
ప్రధానంగా అమరావతి రాజధాని( Amaravathi capital ) ఉద్యమంలో మహిళా రైతుల ది కీలక పాత్ర. ఎన్నెన్నో అవమానాలను వారు ఎదుర్కొన్నారు. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవల్లి వంటి యాత్రలను చేపట్టారు. వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సుదీర్ఘకాలం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరుతాయని భావించారు. కానీ ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు రైతులపై నమోదు చేసిన కేసులు కొట్టివేయలేదు. కేవలం కేసుల కొట్టివేత అనేది నేతలకు పరిమితం కావడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు.
* చాలా కేసులు కొట్టివేత
మొన్నటికి మొన్న లోక్ అదాలత్ లో( Lok Adalat) చాలావరకు కేసులను కొట్టివేశారు. అయితే ఇంకా చాలా కేసులు మిగిలి ఉన్నాయి. ఇంకా రైతులు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ తమ కేసుల విషయంలో మాత్రం సరైన ఆదేశాలు ఇవ్వలేదన్న ఆవేదన అమరావతి రైతుల్లో ఉంది. అయితే మొన్నటి మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ దానిపై చర్చించకపోవడంతో మరోసారి నిరాశ చెందారు. అయితే ఇప్పటికే రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది.
* చరిత్రలో ఉద్యమం
అయితే అమరావతి రాజధాని( Amaravati capital ) రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగున్నర సంవత్సరాల పాటు పెద్ద యుద్ధమే చేశారు. న్యాయ పోరాటానికి సైతం దిగారు. అన్ని పార్టీల మద్దతు ఉన్నా.. తమ సొంత అజెండాతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో అమరావతి రైతుల కృషిని అభినందించాల్సిందే. పొరపాటున మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. అమరావతి రైతుల పోరాటం నిష్ఫలంగా మారేది. కానీ టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది. కానీ రైతులకు మాత్రం ఇంతవరకు ఉపశమనం కలగలేదు. వారిపై నమోదైన కేసులు కొట్టివేయలేదు. ఈ విషయంలో మాత్రం వారిలో ఉన్న అసంతృప్తి తగ్గడం లేదు. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.