AP Liquor: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. అప్పటివరకు ప్రైవేటు విధానం ఉండేది. టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం విక్రయించే అవకాశాలు కల్పించేవారు.

Written By: Dharma, Updated On : May 28, 2024 12:23 pm

AP Liquor

Follow us on

AP Liquor: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చేతిలో ఫోన్ ఉంటేనే మద్యం అని తేల్చి చెబుతోంది. దీంతో మందుబాబులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికే నాసిరకం మద్యం, అధిక ధరలతో మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికప్పుడు మార్చిన నిబంధనలతో అసౌకర్యానికి గురవుతూ వచ్చారు. ఇప్పుడు కౌంటింగ్ కు ముందు కూడా లేనిపోని మార్పులు చేస్తుండడంతో సహనం కోల్పోతున్నారు. ప్రభుత్వ తీరుపై తిట్ల దండకంతో రెచ్చిపోతున్నారు. దీంతో మద్యం షాపుల వద్ద గొడవలు జరుగుతున్నాయి. సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. అప్పటివరకు ప్రైవేటు విధానం ఉండేది. టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం విక్రయించే అవకాశాలు కల్పించేవారు. అయితే మద్యంతో కుటుంబాలు విచ్చినం అవుతున్నాయని.. తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామని జగన్ విపక్షనేతగా హామీ ఇచ్చారు. నవరత్నాల్లో సైతం పొందుపరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. ఏటా 25% షాపులను తగ్గించి.. నాలుగు సంవత్సరాలలో సంపూర్ణ మధ్య నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. తొలి రెండు సంవత్సరాలు చెప్పినట్టుగానే నామమాత్రంగా షాపులను తగ్గించారు. చివరి మూడు సంవత్సరాలు మాత్రం ఆదాయాన్ని పెంచుకునేందుకు విపరీతంగా షాపులను పెంచారు. మధ్య నిషేధం మాటను అటకెక్కించారు.

ఇప్పుడు అన్ని రకాల లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. ఒక్క ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మాత్రం కేవలం నగదు లావాదేవీలకు మాత్రమే అనుమతించారు. దీనిపై విపక్షాల నుంచి ఎన్నో రకాల అభ్యంతరాలు వచ్చాయి. విమర్శలు చెలరేగాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు మాత్రమే అవకాశం ఇచ్చారు. అమ్మకాల టార్గెట్ ను కూడా పెట్టారు. అయితే ఇదంతా ఉన్న మద్యం స్టాకును అమ్మేందుకే నన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం మారిన మరుక్షణం ఈ స్టాక్ ను వెనక్కి పంపడం ఖాయంగా తెలుస్తోంది. అందుకే అమ్మకాలు పెంచుకునేందుకు ఇప్పుడు ఉన్నట్టుండి డిజిటల్ పేమెంట్ లను తెరపైకి తెచ్చారు. అయితే ఇది తెలియని మందుబాబులు డబ్బులతో వెళ్తుంటే.. సిబ్బంది మద్యం ఇవ్వడం లేదు. దీంతో షాపుల వద్ద వివాదాలు జరుగుతున్నాయి.