Nara Lokesh Colombo trip: అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. అధికారంలో లేనప్పుడు మరొక విధంగా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు సకల భోగాలు అనుభవించి.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి.. మౌలిక వసతులు కల్పించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి శత విధాలుగా కృషి చేస్తున్నారు. ఏపీలో మల్టి నేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పిస్తున్నారు.
నారా లోకేష్ అప్పుడప్పుడు ఆటవిడుపు కోసం క్రికెట్ మ్యాచ్ లు చూస్తుంటారు. ఆయన అద్భుతమైన క్రికెటర్ కూడా. విశాఖపట్నంలో ఇటీవల కాలంలో అనేక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మహిళా వండే వరల్డ్ కప్, అంతకుముందు కొన్ని సిరీస్ లలో మ్యాచులు నిర్వహించారు. తద్వారా విశాఖపట్నం కి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టే విధంగా నారా లోకేష్ ఒప్పించి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను వైజాగ్ తీసుకొచ్చి.. సముద్ర తీర నగరాన్ని సరికొత్తగా మార్చారు.
క్రికెట్ ను అమితంగా ఇష్టపడే నారా లోకేష్.. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లను చూశారు. అంతేకాదు టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ కూడా వీక్షించారు. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.
నారా లోకేష్ కొలంబో వెళ్లిన విషయాన్ని గాయి గత్తర చేయాలని వైసిపి భావించింది. ఈ క్రమంలోనే కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మొదలుపెట్టింది. నారా లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ ఫ్లైట్ కట్టించుకొని కొలంబో వెళ్లిపోయారని.. అక్కడ సకల సౌకర్యాలు ఉన్న హోటల్లో బస చేశారని.. ఆయన సిబ్బంది ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించిందని. . ఇలా అడ్డగోలుగా రాసుకుంటూ పోయింది. ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేసుకుంటూ వెళ్ళింది .
ఈ విషయం నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. వెంటనే సోషల్ మీడియాలో వైసిపి మీడియా విభాగం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.. ” ఫ్లైట్ టికెట్టూ నాదే. మ్యాచ్ టికెట్టూ నాదే. నా దుడ్ల(రాయలసీమ మాండలికంలో డబ్బులు) తో నేను మ్యాచ్ చూస్తిని. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా వైయస్ జగన్మోహన్ రెడ్డి?” అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వైసిపికి కౌంటర్ ఇచ్చారు. కొలంబో తన సొంత డబ్బులతో వెళ్లానని.. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసిపి మీడియా మరొకసారి అడ్డంగా బుక్ అయింది. లోకేష్ మీద దుష్ప్రచారం చేయబోయి.. తనమీద తానే దుమ్మెత్తి పోసుకుంది.