YSR Congrees Party : ఆ లోటును పూడ్చుకునే పనిలో టిడిపి.. బెంబేలెత్తుతున్న వైసీపీ*

ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉంది. సంపూర్ణ విజయంతో వైసీపీకి షాక్ ఇచ్చింది. దీంతో పెద్ద నాయకులు సైలెంట్ అయ్యారు. కొందరు పార్టీ మారిపోయారు. అయితే వైసిపి ద్వారా పదవులు దక్కించుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం పునరాలోచనలో పడిపోయారు. వారు సైతం ఒక్కొక్కరు టీడీపీ గూటిలో చేరుతున్నారు.

Written By: Dharma, Updated On : September 19, 2024 1:34 pm

TDP

Follow us on

YSR Congrees Party :  వైసీపీకి డేంజర్ బెల్ మోగుతోందా? ఆ పార్టీ కీలక నేతలు గుడ్ బై చెప్పనున్నారా? ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్తుండడం వ్యూహాత్మకమా? అది కూటమి పార్టీల ఎత్తుగడ? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం కూటమి పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్, పుంగనూరు మున్సిపాలిటీలో టిడిపి జెండా ఎగురవేసింది. తాజాగా ఒంగోలు కార్పొరేషన్, హిందూపురం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. విశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోను హవా చాటింది. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ మార్పులు వైసీపీలో కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దే హవా. దాదాపు 95 శాతం ఆ పార్టీకి దక్కాయి. ఒక్క పట్టణాలే కాదు జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసిపి పరమయ్యాయి. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను టిడిపి బహిష్కరించడంతో చాలాచోట్ల వైసిపి అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు.

* వైసిపి ప్రజాప్రతినిధుల్లో ఆందోళన
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని.. తమకు తిరుగులేదని వారు భావించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలత రావడంతో వైసిపికి భవిష్యత్తు లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకే టిడిపి టచ్ లోకి వెళ్తున్నారు. రెండు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ టిడిపిలో చేరారు. చాలా జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ఇదే ఆలోచనతో ఉన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన పట్టణాలు సైతం.. ఇప్పుడు టిడిపి గొడుగు కిందకు వస్తున్నాయి. గుంప గుత్తిగా చైర్మన్ ల తో పాటు కౌన్సిలర్లు టిడిపిలో చేరుతున్నారు.

* టిడిపికి ప్రాతినిధ్యం లేదు
ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది టిడిపి కూటమి. కానీ స్థానిక సంస్థల్లో ఆ పార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడం లోటు. టిడిపి సొంతంగా తాడిపత్రి, కొండపల్లి, దర్శి మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకుంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థలే కీలకం. అక్కడ వైసీపీ పాలకవర్గాలు ఉండడంతో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే స్థానిక సమస్యలను తమ వైపు తిప్పుకోవాలని టిడిపి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులను ఆకర్షించే పనిలో పడింది.

* జడ్పీలపై ఫోకస్
ముఖ్యంగా జిల్లా పరిషత్తులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉమ్మడి 13 జిల్లాల్లో వైసీపీకి చెందిన వారే జిల్లా పరిషత్ చైర్మన్లు గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. మిగతా జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ల తో చర్చలు జరుగుతున్నాయని.. మున్ముందు వారంతా టిడిపిలో చేరడం ఖాయమని ప్రచారం సాగుతోంది.