Central leaders opinion on Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడ కొత్త సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ లో బిజెపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలనకు తెరదించుతూ… అక్కడ కాషాయ పార్టీ జెండా ఎగురవేసింది. రాష్ట్రానికి బిజెపి తొలి సీఎం గా సువేందూ అధికారి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బిజెపి పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ పక్ష సీఎంలు కూడా హాజరయ్యారు. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం రావడంతో ఆయన ఈరోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ఇటీవల బీజేపీ పరంగా, ఎన్డీఏ పరంగా కార్యక్రమాలకు చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతూ వస్తున్నాయి. చంద్రబాబు సైతం పాల్గొంటున్నారు.
కీలక భాగస్వామి..
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి పదవి చేపట్టేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించింది ఏపీ. అందుకే రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాజకీయంగాను ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నారు కేంద్ర పెద్దలు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్ట్లు కేటాయిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని బలమైన రాజకీయ మిత్రుడిగా మార్చుకున్నారు. 2014 నుంచి 2024 కంటే.. 2024 తరువాత కేంద్రంలో చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం పెరగడం విశేషం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పెద్దలు ప్రాధాన్యం ఇస్తుండగా.. చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు.
అలా విడిపోయి..
2014లో తొలిసారిగా నవ్యాంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధాని కూడా అయ్యారు. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కీలక భాగస్వామి ఎన్డీఏలో. కానీ జాతీయస్థాయిలో ఆ ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందుకే టిడిపి పట్ల అప్పట్లో బీజేపీ నిర్లక్ష్యం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యర్థుల ట్రాప్ లో పడి 2018లో ఎన్డీఏకు దూరమయ్యారు చంద్రబాబు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా అడుగులు వేశారు. అందుకు 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను చవిచూశారు. రాజకీయంగాను ఇబ్బంది పడ్డారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని… కేంద్ర పెద్దలతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. తమ మధ్య వచ్చిన గ్యాప్ పూర్తిగా పోయేలా చేసుకున్నారు. అందుకే కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. అయితే ఈ పరిస్థితి వస్తుందని సగటు టిడిపి శ్రేణులకు నమ్మకం ఉండేది కాదు. అంతలా ఉండేది చంద్రబాబు విషయంలో కేంద్ర పెద్దల వైఖరి. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ప్రాధాన్యం పెరుగుతుండడం.. ఎన్డీఏ తో పాటు బిజెపికి మంచి ఫలితాలు వస్తుండడంతో.. 2029 ఎన్నికల్లో కూడా డోకా ఉండదు అనే అభిప్రాయానికి వస్తున్నారు టిడిపి శ్రేణులు.