Amanchi Krishna Mohan: జనసేనలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీలతో పాటు తటస్తులను చేర్చుకునేందుకు జనసేన హై కమాండ్ 14 మంది నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ బాధ్యతలు ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా పై ఫుల్ ఫోకస్ పెట్టారు బాలినేని. బలమైన నేతను జనసేనలో చేర్పించేందుకు ఆయన గట్టి ప్రణాళిక రూపొందించారు.. గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన నేతను జనసేనలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వైసిపి పై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలను జనసేనలోకి రప్పించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది.
బాలినేని చర్చలు..
ప్రకాశం జిల్లా కు చెందిన ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేనలో చేరుతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయనతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 30 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు కృష్ణమోహన్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నికలకు ముందు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని మొన్నటివరకు ప్రచారం సాగింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో జనసేన అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న చర్చలు కొలిక్కి రావడంతో.. త్వరలో ఆమంచి జనసేనలో చేరుతారని తెలుస్తోంది.
జిల్లాలో బలమైన నేత..
ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు ఆమంచి కృష్ణమోహన్. 2000లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి. వేటపాలెం జడ్పిటిసి సభ్యుడిగా గెలిచారు. తరువాత ఎంపీపీ అయ్యారు. 2004లో రోశయ్య చీరాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రోశయ్య గెలుపు కోసం కృషి చేశారు. 2009లో రోశయ్య పక్కకు తప్పుకోవడంతో.. చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ కు.. 2014లో టిక్కెట్ దక్కక పోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేయగా టిడిపి అభ్యర్థిగా ఉన్న కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరారు. అప్పటినుంచి విభేదాలు మొదలయ్యాయి. జగన్ కరణం బలరాం వైపు నిలబడడంతో.. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్లో యాక్టివ్ గా లేరు. ఇప్పుడు బాలినేని ద్వారా జనసేనలో చేరికకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
