Thammineni Seetharam: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం చుట్టూ ఇప్పుడు భూ కబ్జా కుట్ర కేసు ఆలుముకుంది. ఒక భూమికి సంబంధించి యజమాని ప్రాణాలతో ఉండగానే.. ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి.. తప్పుడు వారసత్వ పత్రాలు ఆధారంగా విలువైన భూమిని కొట్టేయాలని చూశారనేది తమ్మినేని పై నమోదైన కేసు సారాంశం. అసలు యజమాని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి తమ్మినేని కుటుంబం చేసిన కుట్రను ఛేదించారు. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో తమ్మినేని సీతారాం తో పాటు కుటుంబ సభ్యుల పేర్లను నిందితులుగా చేర్చారు.
* అధికారంలో ఉండగానే..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో స్పీకర్ గా పని చేశారు తమ్మినేని. ఆ సమయంలోనే ఈ భూకబ్జా కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. అసలు యజమాని బతికుండగానే ఆయన పేరుతో వారసులను సృష్టించి.. నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించారనేది పోలీసుల దర్యాప్తులో తేలిన అంశం. ఈ కేసులో తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ను ఐదో నిందితుడిగా.. తమ్మినేని సీతారాంను ఆరో నిందితుడిగా.. ఆయన భార్య తమ్మినేని వాణిని ఏడో నిందితురాలిగా పోలీసులు కేసులో చేర్చారు. అధికారంలో ఉన్నప్పుడే ఈ ఫోర్జరీ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు వివరాలను బయటపెట్టారు. నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ, భూకబ్జ కుట్రతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులకు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
* సుదీర్ఘ నేపథ్యం..
తమ్మినేని సీతారాం సుదీర్ఘ రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఆయన కొద్ది రోజులపాటు ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చి.. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా కూడా పని చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు పోటీ చేసి.. ఒకసారి మాత్రమే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి తమ్మినేని పార్టీ నుంచి దూరం పెట్టారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఒకానొక దశలో తమ్మినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఛాన్స్ లేకుండా పోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మరి తాజాగా భూకబ్జా కేసు నమోదైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
