Ration Card: దేశంలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపినీ చేయాలని చూస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో పలు సందర్భాల్లో ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేసింది. అయితే ప్రస్తుతం చాలా మంది కొత్త రేషన్ కార్డులు పొందిన వారు ఈ కేవైసీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మరోసారి రేషన్ షాపుల వద్ద రద్దీ నెలకొనే అవకాశం ఉంది. అసలు ఈ కేవైసీ కోసం ఏం చేయాలంటే?
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు , సెప్టెంబర్ , అక్టోబర్ మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గోదాముల్లో అవసరమైన నిల్వలు సిద్ధం చేయడంతో పాటు, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల 15 రోజులపాటు మాత్రమే రేషన్ దుకాణాలు పనిచేస్తుంటాయి. అయితే ఈసారి భారీ స్థాయిలో బియ్యం పంపిణీ జరగనున్న నేపథ్యంలో నెల మొత్తం రేషన్ దుకాణాలను తెరిచి ఉంచాలని డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు రద్దీ లేకుండా తమకు కేటాయించిన బియ్యాన్ని సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది.
వర్షాభావం, పంటల నష్టం, ఆహార ధాన్యాల కొరత వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో ముందస్తుగా మూడు నెలల రేషన్ బియ్యం అందించడం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆహార సరఫరా అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ప్రతి రేషన్ దుకాణానికి తగినంత బియ్యం నిల్వలను చేరవేయడం, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడం, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేసి, మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ నిర్ణయం ఉపశమనంగా మారనుంది.
ఇదిలా ఉండగా తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా e-KYC ప్రక్రియను జూలై 31లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉచితంగా ఈ సేవను అందుబాటులో ఉంచిందని, గడువు ముగిసేలోపు e-KYC చేయించుకోని వారు భవిష్యత్తులో రేషన్ పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు వెంట తీసుకుని సమీపంలోని రేషన్ డీలర్ వద్ద లేదా మీ సేవ కేంద్రంలో ఉచితంగా e-KYC చేయించుకోవచ్చు. బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుడి వివరాలు సరిచూసి నమోదు చేస్తారు.
