Santhi Swaroop: సీనియర్ న్యూస్ రీడర్ ఇక లేరు

శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్.. దూరదర్శన్ అంటే శాంతి స్వరూప్ అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది.అప్పటివరకు ఆకాశవాణి వార్తలకి అత్యంత ప్రాధాన్యం ఉండేది.

Written By: Dharma, Updated On : April 5, 2024 1:53 pm

Santhi Swaroop passed away

Follow us on

Santhi Swaroop: దూరదర్శన్ న్యూస్ గుర్తుంది కదూ. రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఈ న్యూస్ ను వినసొంపైన కంఠంతో శాంతి స్వరూప్ చదివేవారు. నమస్కారం.. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంటూ చదవడం ప్రారంభించే వారు. ఆయన గొంతు కోసమే చాలామంది ఆ న్యూస్ చూసేవారు. సుదీర్ఘకాలం ఆయన దూరదర్శన్ కు సేవలందించారు. కానీ వయోభారంతో న్యూస్ రీడర్ ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. కానీ ఒక న్యూస్ రీడర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం శాంతి స్వరూప్ గొప్పతనం.అటువంటి గొప్ప న్యూస్ రీడర్ గుండెపోటుతో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్.. దూరదర్శన్ అంటే శాంతి స్వరూప్ అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది.అప్పటివరకు ఆకాశవాణి వార్తలకి అత్యంత ప్రాధాన్యం ఉండేది. కానీ శాంతి స్వరూప్ దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించాక.. వీక్షకులను తన వైపు తిప్పుకున్నారు. గమ్మత్తయిన వాయిస్ తో వీక్షకులను అలరించేవారు. 1983 నవంబర్ 14 నుంచి శాంతి స్వరూప్ దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011లో పదవీ విరమణ చేశారు.

ఇప్పటిలా న్యూస్ రీడర్స్ కు ఎదురుగా టెలి ప్రామిటింగ్ ఉండేది కాదు. ముందుగా పేపర్లో వార్తలు రాసుకొని.. తన ముందు పెట్టుకొని శాంతి స్వరూప్ చదివేవారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా, సరళంగా శాంతి స్వరూప్ వార్తలు సాగేవి. ఇటీవల ఆయన పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. నాటి గురుతులను నెమరు వేసుకునేవారు. ఈ తరం యాంకర్లకు ఆయన విలువైన సలహాలు,సూచనలు అందించేవారు. వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి అని శాంతి స్వరూప్ నేటితరం న్యూస్ రీడర్లకు సలహా ఇచ్చేవారు.రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ మృత్యుపై పోరాటంలో ఆయన ఓడిపోయారు. నేడు తుది శ్వాస విడిచారు. 80వ దశకంలో బుల్లితెరపై న్యూస్ ప్రజెంటేటర్ గా ఆయన ముద్ర చెరపరానిది.