TDP vs YSRCP political clash: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు గొడ్డలి వర్సెస్ గుణపం అన్న పదం ఎక్కువగా వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా టిడిపి చెబుతోంది. తెలుగుదేశం పార్టీని గుణపం పార్టీతో పోల్చుతోంది వైసిపి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి అని పేరు పెట్టింది టిడిపి. చాలా రోజుల కిందట నుంచి ఈ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చింది. వచ్చే ఎన్నికల వరకు ఈ గొడ్డలి అనే అంశాన్ని తీసుకెళ్లాలని టిడిపి భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేల్కొంది. తమని గొడ్డలి పార్టీ అంటారా? మీదే గుణపం పార్టీ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. దీంతో ఏపీలో ఇప్పుడు గొడ్డలి పార్టీ వర్సెస్ గుణపం పార్టీ అన్నట్టు పరిస్థితి మారింది. అయితే వైసిపి పై గొడ్డలి పార్టీ అని చెప్పేందుకు రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వాడుకుంది టిడిపి. కానీ వైసిపి టిడిపి పై గుణపం పార్టీ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు.
సానుభూతి వర్కౌట్..
వైయస్ వివేకానంద రెడ్డి ( Y S Vivekananda Reddy )హత్య అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎనలేని సానుభూతిని తెచ్చి విజయానికి కారణం అయింది. కానీ 2024 ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలత చూపింది. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటు అని చిత్రీకరించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాదు కాదు గొడ్డలితో వేటు వేశారు అంటూ రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసింది. రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రాగలిగింది. తరువాత ఈ హత్య వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల హస్తం ఉందని.. నిందితులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారంటూ స్వయంగా ఆయన చెల్లెల్లు షర్మిల తో పాటు సునీత ఆరోపిస్తూ వచ్చారు. గొడ్డలితో నరికేసారంటూ జగన్ చెప్పిన మాటలనే పదేపదే వల్లే వేస్తూ దీనిపై న్యాయం చేయాలని ఆ ఇద్దరు చెల్లెళ్లు కోరుతూ వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది కూడా. అయితే సాక్షాధారాలను చెరిపేయడంతో ఈ కేసు కొలిక్కి రావడం లేదు కానీ.. ఎవరు చంపారు.. ఎవరు చంపించారు అనే దానిపై ప్రజల్లో ఒక క్లారిటీ ఉంది. కేసుల పరంగా కాకుండా రాజకీయపరంగా దీనిని సజీవంగా ఉంచాలని టిడిపి భావించింది. అందుకే గొడ్డలి పార్టీగా వైసీపీకి పేరు పెట్టింది. ఇప్పుడు ప్రతి పార్టీ నాయకుడు వైసీపీని గొడ్డలి పార్టీగానే పేర్కొంటున్నారు. ప్రజల్లోకి ఇది బలంగా వెళ్తుంది కూడా. 2029 ఎన్నికల వరకు గొడ్డలి పార్టీని సజీవంగా ఉంచాలన్నదే టిడిపి కూటమి వ్యూహం. అందుకే జగన్మోహన్ రెడ్డి నోటితో వచ్చిన గొడ్డలి మాటలు.. షర్మిల తో పాటు సునీత నోటి నుంచి వచ్చిన గొడ్డలి మాటలను జత చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ కూటమి.
ఆలస్యంగా స్పందించిన వైసిపి..
అయితే ఇప్పుడు అసలైన విషయాన్ని గ్రహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం పార్టీని గుణపం పార్టీగా అభివర్ణిస్తోంది. సొంత మామ ఎన్టీఆర్ ను గుణపంతో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైసిపి నేతలు. అయితే ఇప్పటికే వెన్నుపోటు అనేది చంద్రబాబు దాటేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజామోదం పొందారు. నవ్యాంధ్రప్రదేశ్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. పైగా చంద్రబాబుది వెన్నుపోటు అని నందమూరి కుటుంబం కూడా అనలేకపోతోంది. అసలు గుణపం అనేది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అయితే టిడిపి గొడ్డలి ప్రచారానికి విరుగుడుగా.. వైసిపి గుణపం ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. అయితే గొడ్డలి పార్టీ ప్రజల్లోకి వెళ్లిన విధంగా.. గుణపం అంతలా వెళ్లకపోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటు.