Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: హవ్వా.. టిడిపి నేతలే బిజెపి అభ్యర్థులా?

AP Elections 2024: హవ్వా.. టిడిపి నేతలే బిజెపి అభ్యర్థులా?

AP Elections 2024: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. సాధారణంగా అధికారపక్షం నుంచి విపక్షంలోకి.. విపక్షం నుంచి అధికారపక్షంలోకి వలసలు సాగుతుంటాయి. కానీ ఏపీలో విచిత్రంగా నేతల చేరికలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను వదులుకుంది. ఈ లెక్కన తాను వదులుకున్న స్థానాల్లో బిజెపి, జనసేన నేతలు పోటీ చేయాలి. కానీ ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు లేరు. దీంతో రాత్రికి రాత్రే టిడిపి నేతలు ఆ రెండు పార్టీల్లో చేరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా మారుతున్నారు. తాజాగా అనపర్తి టిడిపి ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థి కావడం విశేషం.

అయితే టిడిపి నేతలకు కండువా కప్పి తన పార్టీ అభ్యర్థిగా తొలుతా ప్రకటించిన వారు మాత్రం పవన్ కళ్యాణే.భీమవరం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత పులపర్తి ఆంజనేయులకు జనసేనలోకి రప్పించారు.జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అది మొదలు చాలామంది టీడీపీ నాయకులకు జనసేనలోకి రప్పించి టికెట్లు కట్టబెట్టారు. ఈ సంస్కృతి బిజెపిలో సైతం కనిపిస్తుండడం విశేషం. దీని వెనుక చంద్రబాబు చతురత ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవడంతో టీడీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. దానిని అధిగమించేందుకు చంద్రబాబు ఇలా ప్లాన్ చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

మొన్న ఆ మధ్యన అవనిగడ్డకు చెందిన టిడిపి సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారు. కానీ అక్కడ జనసేన నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేకుండా పోయారు. ఐవిఆర్ఎస్ సర్వేలో సైతం జనసేన నేతలకు సానుకూలత రాలేదు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయించారు. పాలకొండలో కూడా సేమ్ సీన్. టిడిపి ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయించారు.

ఇప్పుడు బిజెపి ఆ పరిస్థితికి వచ్చింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి అనపర్తి సీటు కేటాయించారు. అక్కడ బిజెపి అభ్యర్థిని సైతం ప్రకటించింది.కానీ ఆ నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ తీరుపై ఆగ్రహం చెందారు. అదే సమయంలో బిజెపి ప్రకటించిన అభ్యర్థిపై అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఆయన వైసీపీ అభ్యర్థి పై నెగ్గుకు రాలేరని ప్రచారం బలంగా జరిగింది. దీంతో అక్కడ బిజెపి ఒక ఆలోచనకు వచ్చింది.నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి రప్పించి టికెట్ కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో ఆయన విజయవాడబిజెపి కార్యాలయానికి వెళ్లి కండువా మార్చుకున్నారు. అనపర్తి బిజెపి అభ్యర్థిగా మారిపోయారు. పేరుకే పొత్తు కానీ, పేరుకే సీట్ల కేటాయింపు కానీ.. బిజెపి, జనసేనకు కేటాయించిన సీట్లలో టిడిపి నేతలే పోటీ చేస్తుండడం గమనార్హం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version