TDP Governor Post: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రెండు మంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే అది తెలుగుదేశం పార్టీకి ఆ ఆఫర్ అని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరాయి. బిజెపికి సానుకూల ఫలితాలు వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు మిత్రులతో మరింత బలం పెంచుకోవాలని చూస్తోంది బిజెపి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేతో స్నేహం చేసేందుకు.. ఎన్డీఏలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టింది. ఇంకోవైపు టిడిపి తో మరింత బలం పెంచుకునేందుకు వీలుగా రాజకీయ అండదండలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* అశోక్ గజపతిరాజుకు అవకాశం..
టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఆయన గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పట్లోనే రెండో గవర్నర్ పోస్ట్ ఇస్తారని ప్రచారం నడిచింది. కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి తప్పకుండా టిడిపికి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీసీలకు లేదా ఎస్సీలకు ఆ పదవి ఆఫర్ చేస్తారని తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు టిడిపి ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అందుకే ఆయనకు గవర్నర్ పదవితో గౌరవప్రదమైన పదవీ విరమణ లభించినట్లు అవుతుంది.
* సీనియర్లకు ఛాన్స్..
అయితే ఇప్పుడు గవర్నర్ పోస్ట్ కోసం ఇద్దరు నేతల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే యనమల రామకృష్ణుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే యనమల రామకృష్ణుడు రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. ఆపై కేంద్ర క్యాబినెట్లో ఒక ఛాన్స్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంత్రిగా, స్పీకర్ గా సేవలందించిన ఆయన కేంద్ర రాజకీయాలు లోటు. అందుకే ఆయన గవర్నర్ కంటే కేంద్రమంత్రి పై మోజు పెంచుకున్నారు. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని గవర్నర్ పోస్ట్ కు ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అందుకే రాజ్యాంగబద్ధ పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఒకవేళ ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం మాజీ స్పీకర్ ప్రతిభాభారతికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఆమె సైతం సీనియర్ మోస్ట్ లీడర్. సుదీర్ఘకాలం మంత్రిగా వ్యవహరించారు. శాసనసభ తొలి మహిళా స్పీకర్ గా కూడా గుర్తింపు సాధించారు. ఆమెకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఎస్సీల్లో సానుభూతి పొందాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే టీడీపీకి మరో గవర్నర్ పోస్ట్ లభించనుందన్నమాట.
