TDP: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అనేక రకాల ప్రయోజనాలు ప్రత్యేకంగా వస్తున్నాయి. కేంద్ర పెద్దలు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఏపీలోని భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించారు. ప్రధాన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మరో గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంద్రబాబుతో కూడా చర్చించినట్లు సమాచారం. పార్టీలో ఆలోచించి చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పార్టీకి సేవలందించిన సీనియర్లకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందులో ఓ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
* మొన్ననే అశోక్ గజపతి రాజుకు..
మొన్ననే అశోక్ గజపతి రాజుకు గవర్నర్గా అవకాశం కల్పించింది కేంద్రం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా అశోక్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సీనియర్ నేత కావడం, వివాదరహితుడు కావడంతో చంద్రబాబు అశోక్ కు గవర్నర్గా అవకాశము ఇచ్చారు. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు టిడిపికి ఇంకో గవర్నర్ పోస్ట్ రానుండడంతో సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రముఖంగా యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు వర్ల రామయ్య, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇందులో కేఈ కృష్ణమూర్తి అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం యనమల రామకృష్ణుడుకు అవకాశం దక్కుతుందని ప్రచారంలో ఉంది.
* ప్రతిభా భారతికి ఛాన్స్..
మరోవైపు ప్రతిభా భారతికి ఇస్తే మహిళా కోటా తో పాటు ఎస్సీ రిజర్వేషన్ సైతం పరిగణలోకి తీసుకున్నట్టు అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మహిళా మంత్రిగా, శాసనసభ స్పీకర్గా విశేష సేవలు అందించారు ప్రతిభా భారతి. ఆమెకు పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. 1983 నుంచి 1999 వరకు గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా మంచి సేవలు అందించారు. శాసనసభ స్పీకర్ గా తనదైన ముద్ర చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె గ్రీష్మ ఎమ్మెల్సీగా ఉన్నారు.మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
