Tirumala Laddu :తిరుమలేషుడితో పెట్టుకుంటున్నావ్ ‘బాబూ’… షర్మిల షాకింగ్ స్పందన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైసిపి ప్రభుత్వ హయాంలో వైఫల్యాలను బయటపెడుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీఫై చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది.

Written By: Dharma, Updated On : September 19, 2024 4:35 pm

Tirumala Laddu

Follow us on

Tirumala Laddu : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో.. నెయ్యికి బదులు జంతువుల నూనెతో ప్రసాదం తయారు చేశారంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్లుగా పని చేసిన భూమున కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి, స్వార్థం కోసం భగవంతుడిని వాడుకునే వారికి దేవుడు కూడా క్షమించడు అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదన్నారు కరుణాకర్ రెడ్డి. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించారని గుర్తు చేశారు. ఆ సమయంలో భగవంతుడు శిక్షించాడని.. నాటి అలిపిరిలో గత నన్ను గుర్తు చేశారు కరుణాకర్ రెడ్డి.

* అధికారుల ప్రమేయం ఉండదా
వాస్తవానికి తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారుల ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. అటువంటి వారి హస్తాలమీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడు అంటే.. ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి… తిరుమల తిరుపతి దేవస్థానం పై ఫోకస్ పెట్టారని.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. చివరకు స్వామివారి ప్రసాదాలపై సైతం దుష్ప్రచారం చేయడం దారుణంగా వ్యాఖ్యానించారు కరుణాకర్ రెడ్డి.

* వై వి సుబ్బారెడ్డి సవాల్
మరోవైపు వై వి సుబ్బారెడ్డి సవాళ్లతో రెచ్చిపోయారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచనికైనా చంద్రబాబు వెనుకాడరని మరో మారు నిరూపితం అయిందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. తిరుమలను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

* విచారణ చేయాలి
మరోవైపు ఈ ఘటనపై పిసిసి చీఫ్ షర్మిల స్పందించారు. అయితే ఈసారి ఆమె స్పందన భిన్నంగా ఉంది. సీఎం హోదాలో ఉండి అలా ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కామెంట్స్ తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉండకూడదని.. చంద్రబాబు ఆరోపణల్లో నిజం ఉంటే.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలనిఆమె డిమాండ్ చేశారు. మొత్తానికి అయితే ఈ పరిణామం వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.