RK Kothapaluku: తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో అనేకమంది బిజెపి నాయకులను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలలో బిజెపి నాయకులను ఆయన అనేక రకాలుగా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా వ్యవస్థల ధ్వంసం.. మతతత్వ రాజకీయాల గురించి పదేపదే మాట్లాడారు. ఒక దశలో బిజెపి పరిపాలన మీద.. నరేంద్ర మోడీ వ్యవహార శైలి మీద వ్యంగ్యంగా విమర్శలు చేశారు.. అంతేకాదు సర్ ఎక్స్ ఎల్ మాటను పదేపదే వ్యాఖ్యానించేవారు.. దీంతో బీజేపీ నాయకులకు మాట్లాడే అవకాశం లేకుండా పోయేది.
అటువంటి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకులో తన స్వరాన్ని మార్చారు. తన పెన్ను పవర్ వేరే వైపు మళ్ళించారు. నిప్పులు చెరిగే విధంగా ఉండే తన రాతలను నరేంద్ర మోడీకి జై కొట్టడానికి ప్రయోగించారు. తద్వారా ఈ ఆదివారం నాటి కొత్త పలుకు రుచి శుచి లేని వంటకంలాగా మారిపోయింది.
తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ ఏమంటాడంటే..”నరేంద్ర మోడీ, షా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇతర పార్టీలు.. అలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పార్టీ కోసం ఏం చేస్తే బాగుంటుంది అని బిజెపి నాయకులు ఆలోచిస్తారు. పార్టీ వల్ల నాకు ఏం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తారు. ఈ రెండు పార్టీల మధ్య తేడా ఇలా ఉంది కాబట్టి ఫలితాలు అలానే వస్తుంటాయి. యుద్ధానికి దిగేటప్పుడు ప్రత్యర్థుల బలాల గురించి.. బలహీనతల గురించి అంచనా వేయాలి. ఈ విషయంలో నరేంద్ర మోడీని మించిన వారు ఇప్పటి కాలంలో ఎవరూ ఉండకపోవచ్చు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల గురించి, ప్రజల సైకాలజీ గురించి అధ్యయనం చేయాలి. దానికి అనుగుణంగా వ్యూహాలు రచించాలి. అందులో నరేంద్ర మోడీ దిట్ట. ఎన్నికలకు ముందు రచించే వ్యూహాలు మాత్రమే కాకుండా.. ఫలితాల అనంతరం కూడా వ్యూహాలు రచించడం లో నరేంద్ర మోడీ సాటి. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం లో బెంగాల్ ప్రజలకు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. రాజకీయాలలో ఇది అతి పెద్ద స్ట్రోక్ అని చెప్పుకోవాలి” ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు.
నరేంద్ర మోడీ కొత్తగా ఇలా రాజకీయాలు చేయడం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే ఇప్పటి ప్రధానమంత్రిగా ఉన్నప్పటివరకు నరేంద్ర మోడీకి ఇటువంటి రాజకీయాలే ఆయనను ఈ స్థాయి దాకా తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఇందులో ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదే నిజం. కాకపోతే రాధాకృష్ణ నరేంద్ర మోడీ విషయంలో ఇలా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ బిజెపి మీద మతం అనే ముద్ర వేసే రాధాకృష్ణ.. కొత్తగా నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ మీద గొప్పగా రాయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక ఈ కొత్త పరుగులు హైలెట్ ఏంటంటే మొత్తానికి కమ్యూనిస్టుల పరిపాలనను భయానకమైన అనుభవమని రాధాకృష్ణ చెప్పుకున్నారు. మమతా బెనర్జీ వ్యవహార శైలిని సైతం తప్పు పట్టారు. తమిళనాడులో అడ్డగోలు సంక్షేమ పథకాలకు, ఎన్నికల్లో డబ్బు పంచడం వంటి వాటికి ప్రజలు లొంగక పోవడం మంచిదని రాధాకృష్ణ పేర్కొన్నారు. అలాంటప్పుడు సూపర్ సిక్స్ పథకాలను కూడా అదే విధంగా విమర్శించాలి కదా.. ఇక్కడ గొప్పగా చెప్పి.. తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు పంచుడు పథకాలకు లొంగలేదని చెప్పడం.. ఏ తరహా జర్నలిజమో రాధాకృష్ణ చెప్పాలి..