RK Kotha Paluku : వారం గ్యాప్ వచ్చిన తర్వాత.. ఈసారి రాధాకృష్ణ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా.. ముందుకు వచ్చారు. తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకులో జగన్ మీద పడిపోయారు. ఇదేమీ కొత్త కాదు.. కాకపోతే టిడిపి నాయకులకు.. జనసేన నాయకులకు.. భారతీయ జనతా పార్టీ నాయకులకు చేతకానిది.. చేయలేనిది రాధాకృష్ణ చేసి చూపించారు. తన పెన్ పవర్ ఎలా ఉంటుందో.. తాను లోతుల్లోకి వెళ్లి రాస్తే ఎలా ఉంటుందో వాస్తవంలో చూపించారు.
జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. గతంలో ఆయన శాసనసభలో అమరావతి రాజధానికి ఓకే చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు రాజధాని మార్పు విషయాన్ని ఆమోదించబోమని.. రాజధాని నిర్మాణానికి ఒప్పుకుంటామని చెప్పారు. అధికారులకు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ చెప్పారు. 2024 ఎన్నికల చివర్లో విశాఖపట్నం రాజధాని అన్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడేమో మావిగన్ అంటూ చెబుతున్నారు. దీనికి తోడు సో కాల్డ్ విజయవాడ.. సో కాల్డ్ అమరావతి అంటూ మాట్లాడుతున్నారు. వాస్తవానికి జగన్ మావిగన్ పేరు పదేపదే ప్రస్తావించడం వెనక భారీ కుట్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి దానిని మాత్రమే పట్టుకుని వేలాడుతున్నారు అంటే కారణం బలంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో మావిగన్ వ్యవహారం మీద రకరకాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదంటే.. దాని వెనుక కుట్రపూరితమైన ఆలోచన ఉంది.. మావిగన్ ఆలోచనను మెజారిటీ ప్రజలు తప్పుపడుతుంటే.. కొంతమంది స్వాగతిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వివిధ రూపాల్లో ఆయనకు మద్దతిస్తున్న వారు.. మావిగన్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకించడం లేదో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజధాని కంటే.. కులం, మతం మాత్రమే ముఖ్యమని జగన్ రెడ్డి గుర్తించారు. అందువల్లే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు.. రాజధాని లో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల ఖర్చులతో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇలాంటప్పుడు మావిగన్ పేరు ప్రకటించడం హాస్యాస్పదం.. ఇదిగో ఇలా రాసుకుంటూ పోయారు రాధాకృష్ణ.
వాస్తవానికి కులం.. మతం అనేది ఏపీలో మాత్రమే లేవు. ఈ విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోయారు. ఆ మధ్య రాధాకృష్ణ మీద వైసిపి నేతలు.. ఇతర నాయకులు విమర్శలు చేసినప్పుడు కమ్మ సామాజిక వర్గం వాళ్లు నిలబడ్డారు. ఆయనకు అనుకూలంగా ప్రకటనలు చేశారు. నాడు కమ్మ సామాజిక వర్గం వారు తనకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలను ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించారు. అలాంటప్పుడు రాధాకృష్ణ కులం గురించి, మతం గురించి ఎలా మాట్లాడుతారు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు.. నాడు కమ్మ సామాజిక వర్గం మొత్తం సీనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేసింది. నాడు తెలుగుజాతి అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.. ఇప్పటికీ టిడిపికి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం టిడిపిని తమ సొంత పార్టీగా భావిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని సాక్షి మినహా మిగతా మీడియా సంస్థలు రాయవు.
అక్కడిదాకా ఎందుకు ఇప్పుడున్న మీడియా సంస్థల్లో మెజారిటీ సంస్థలు కమ్మ సామాజిక వర్గం వరకే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి.. ఆ కులానికి చెందినవారు కచ్చితంగా ఆయనను అభిమానిస్తారు. ఆదరిస్తారు. ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి.. ఏదో విధంగా దానిని దక్కించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దానిని తప్ప పటాల్సిన అవసరం ఏముంది.. అన్నట్టు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ లేదు. ఒక విధానం అంటూ లేదు. కులాలతో ఆయన రాజకీయాలు చేస్తూనే ఉంటారు. మతాలతో కూడా రాజకీయాలు చేస్తూనే ఉంటారు. జనం వీక్నెస్ ఆయనకు తెలుసు కాబట్టి పావులు కదుపుతూనే ఉంటారు. రాజకీయాలు అంటేనే అలా మారిపోయాయి. కులాలతో.. మతాలతో రాజకీయాలు చేయడం కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు.. అందరికీ అది అలవాటైన విద్యగా మారింది.. కాకపోతే జగన్ అంటే రాధాకృష్ణకు కోపం కాబట్టి.. రాధాకృష్ణ ఇలా రాస్తున్నారు.

