Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిస్సా తీరాల సమీపంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అయితే ఏపీపై చాలా తక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా.. ఉత్తరాంధ్రకు మాత్రమే ఈ ప్రభావం ఉండనుంది.
పిడుగులతో కూడిన వాన..
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
రుతుపవనాల విస్తరణ..
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మళ్లీ విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. దీంతోపాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావం ప్రారంభం కానుంది. అదే జరిగితే వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆశాజనకంగా పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో కనీస స్థాయిలో వర్షాలు పడలేదు. జూలైలో సైతం వర్షాల జాడలేదు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. వాటి విస్తరణ కూడా ఆశాజనకంగా లేదు. అయితే ఇప్పుడు రుతుపవనాలు మరోసారి విస్తరించిన నేపథ్యంలో.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలతో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ పై ఆశలు పెట్టుకున్నారు. మరి వరుణ దేవుడు ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి..







