Raghuram krishnamraju : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు( deputy speaker Raghuram krishnamraju ) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ అవుతుంది. 2024 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు రఘురామకృష్ణం రాజు. చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన రఘురామకృష్ణం రాజు టిడిపిలోకి వచ్చారు. టిడిపి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఓ నిరసన కార్యక్రమానికి రఘురామకృష్ణం రాజు పిలుపునివ్వడం విశేషం. దీనిపైనే అంతటా చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు సమాచారం.
Also Read : ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ సన్నిహిత నేత అరెస్ట్.. ఆ ఎంపీకి ఉపశమనం!
* వైసిపి నాయకత్వం పై తిరుగుబాటు..
2019 ఎన్నికల్లో నరసాపురం( narasapuram ) పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణం రాజు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వంతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటినుంచి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఇరుకున పెట్టేవారు రఘురామకృష్ణం రాజు. అయితే రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అయితే నిబంధనల మేరకు ఆయనపై అనర్హత వేటు కుదరదని పార్టీ స్పీకర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో 2021 మే 14న ఆయన పై రాజ ద్రోహం కేసు నమోదయింది. మతాలను రెచ్చగొడుతూ వర్గ విభేదాలకు కారణమవుతున్నారని చెబుతూ రఘురామకృష్ణం రాజును నాటి పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆయనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు సీరియస్ గా పరిగణించింది. రఘురామకృష్ణం రాజును విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై మరింత రెచ్చిపోయేవారు రఘురామకృష్ణంరాజు.
* అసెంబ్లీకి అనూహ్యంగా..
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రఘురామకృష్ణంరాజు బిజెపిలో( Bhartiya Janata Party) చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో భూపతి రాజు శ్రీనివాస వర్మ నరసాపురం పార్లమెంట్ సీటును దక్కించుకున్నారు. దీంతో చంద్రబాబు రఘురామకృష్ణం రాజును తెలుగుదేశం పార్టీలోకి రప్పించి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలిచారు రఘురామకృష్ణంరాజు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అయితే తాను నాడు తనపై మోపిన రాజ ద్రోహం కేసు విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కలేదు.
* భారీగా జనాలతో నిర్వహణ..
రేపు ఉండి నియోజకవర్గం లో( Undi Constituition ) ప్రతీకార దినోత్సవాన్ని జరుపనున్నారు. తనపై రాజ ద్రోహం కేసు పెట్టి సరిగ్గా నాలుగేళ్లు అవుతుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేయలేదని సంకేతాలు పంపేలా.. రఘురామకృష్ణం రాజు ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతోంది. రేపు ఈ ప్రతీకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ జన సమీకరణ నడుమ ఈ కార్యక్రమం నిర్వహించి రాష్ట్రంలోనే మరోసారి జగన్ పాలనలో జరిగిన వైఫల్యాలను గుర్తుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.