Raghuram Krishnam Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు( AP deputy speaker Raghuram Krishnam Raju ) ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన చుట్టూ ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన అనుకున్నది సాధించారా? ఆ మేరకు ఆయన ప్రయత్నం వర్కౌట్ అయిందా? అనేది ఒక చర్చ. వైసిపి హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజును అప్పటి సిఐడి అధికారులు అరెస్టు చేశారు. పుట్టినరోజు నాడే హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేశారు.. రాజ ద్రోహం కేసు పెట్టి.. జైల్లో పెట్టారు. కస్టడీలో టార్చర్ చేశారు. దీనిపై న్యాయపోరాటం చేసి ఉపశమనం పొందారు రఘురామకృష్ణంరాజు. అప్పట్లో ఆయనపై కస్టడీలో జరిగిన దాడి గురించి కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో అది సాధ్యం కాలేదు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం శపధం చేశారు. తనను టార్చర్ పెట్టిన ఏ ఒక్కరిని విడిచి పెట్టనని హెచ్చరించారు.
* అనూహ్యంగా ఎమ్మెల్యేగా..
తమ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పంతం పట్టారు. మరోసారి నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న రఘురామకృష్ణం రాజును అప్పట్లో తెర వెనుక ఉండి అడ్డుకుంది వైసీపీ అన్నది ఒక అనుమానం. నేరుగా బిజెపిలోకి వెళ్లి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలన్నది రఘురామకృష్ణంరాజు ఆలోచన. అయితే బిజెపిలో ఉన్న తన అనుకూలురుతో రఘురామకృష్ణంరాజుకు టికెట్ లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించి టిడిపి సిట్టింగ్ స్థానం ను వదులుకొని మరి రఘురామకృష్ణం రాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తద్వారా పొలిటికల్ గా తాను అనుకున్నది సాధించారు రఘురామ కృష్ణంరాజు.
* ఆ ఇద్దరు అధికారులపై వేటు..
అయితే పొలిటికల్ గా తాను అనుకున్నది సాధించారు రఘురామకృష్ణంరాజు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి మరింత సవాల్ విసిరాలని చూస్తున్నారు. అయితే తనపై కస్టడీలో టార్చర్కు దిగిన అధికారుల విషయంలో ఉదాసీనతను తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో రఘురామకృష్ణం రాజు అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ప్రచారం నడిచింది. ఒకానొక సమయంలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సైతం రఘురామకృష్ణం రాజును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు అదే సునీల్ కుమార్ పై శాశ్వత సస్పెన్షన్ వేటు వేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు అప్పట్లో కస్టడీలో దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు జరిగింది. దీంతో రఘురామకృష్ణంరాజు పరపతి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. తాను అనుకున్నది సాధించారు ఆయన. తన ప్రతీకారాన్ని సాధించారు కూడా. జగన్ సభలోకి రావాలి.. సభాపతి స్థానంలో తాను ఉండాలి అన్నది రఘురామకృష్ణం రాజు కోరిక. అది కూడా త్వరలో వర్కౌట్ కావాలని రఘురామకృష్ణంరాజు అనుచరులతోపాటు కూటమి శ్రేణులు కోరుతున్నాయి.