Putta Mahesh Kumar Yadav: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్( Putta Mahesh Yadav) పేరు మార్మోగిపోతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. రాయలసీమకు చెందిన మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలతో ఉన్న బంధుత్వం కారణంగానే టిడిపి నాయకత్వం టిక్కెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి కూటమి ప్రభంజనంలో ఆయన ఏలూరు ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో కూరుకుపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
* తండ్రి,మామ సీనియర్ నేతలు..
పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్( Sudhakar Yadav). తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కూడా. మొన్నటి ఎన్నికల్లో మైదకూరు నుంచి గెలిచారు సుధాకర్ యాదవ్. అయితే ఆయన ఏలూరు నుంచి ఎందుకు పోటీ చేశారు అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడికి ఈయన స్వయానా అల్లుడు. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తుని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమె భర్త పుట్టా మహేష్ కుమార్ యాదవ్. అలా గోదావరి జిల్లాలకు సంబంధించిన అల్లుడిగా ఛాన్స్ దక్కింది ఏలూరు ఎంపీగా.
* తలసానితో బంధుత్వం..
తెలంగాణ లో తలసాని శ్రీనివాస్ యాదవ్( thalasani Srinivas Yadav ) బలమైన బీసీ నేత. ఆయన కుటుంబంతో కూడా మహేష్ యాదవ్ కు బంధుత్వం ఉంది. మహేష్ సోదరిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ బంధుత్వం మహేష్ కుమార్ యాదవ్ ఎంపీగా ఎంపికకు దోహద పడింది. వాస్తవానికి ఏలూరు ఎంపీ స్థానానికి విపరీతమైన డిమాండ్ ఉండేది. గతంలో సిట్టింగ్ ఎంపీగా మాగుంట బాబు ఉండేవారు. ఆయనతో పాటు చాలామంది నేతలు అప్పట్లో ఆశావహులుగా ఉండేవారు. కానీ వారందరినీ కాదని మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు పార్లమెంటు సీటును దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడి.. రాజకీయ భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకున్నారు.