Professor Student Audio Viral: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు కీచకులుగా మారుతున్నారు. విద్యార్థినులపై తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు. కామంతో సభ్య సమాజం తలదించేలా వ్యవహరిస్తున్నారు. అటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఏకంగా ఫోన్ చేసి తన కోరికను తీర్చమని కీచక ప్రొఫెసర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం..
అంబేద్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు రామారావు. మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని పై కన్నేశాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే తన సపోర్టు ఉండాల్సిందని ఆమెను ప్రలోభ పెట్టాడు. అంతటితో ఆగకుండా ఫోన్ చేసి వేధింపులు ప్రారంభించాడు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ వేధించాడు. ఈ క్రమంలో నువ్వంటే నాకు ఇష్టం.. ఐ వాంట్ టు యు అంటూ సదరు ప్రొఫెసర్ విద్యార్థినితో చేసిన అసభ్యకర సంభాషణకు సంబంధించి ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రేపు సెలవు కదా.. ఇంటికి రా.. ఇంకా ఎనిమిది సెమిస్టర్లు ఉంటావు.. వస్తే నీ ఇష్టం.. కలిసి ప్రయాణం చేద్దాం అంటూ ఆహ్వానించాడు. అంతటితో ఆగకుండా టైం వేస్ట్ చేయకుండా ఫేస్ టు ఫేస్ చెప్తాను.. ఐ వాంట్ టు యు. మన ప్రయాణంలో ఎలా ఉండాలి.. ఏమిటనేది షేర్ చేసుకుందాం. ఇది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా అంటూ విద్యార్ధినిపై ఒత్తిడి తెచ్చాడు. ఎన్ని గంటలకు వస్తావో చెబితే శ్రీకాకుళం కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటాను.. మా ఇంటికి వచ్చాక నీ ఇష్టం.. నన్ను సార్ అని పిలవద్దు.. అండి అని మాత్రమే పిలువు అని అసిస్టెంట్ ప్రొఫెసర్ రామారావు ఆడియోతో కూడిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బాధితురాలు నేరుగా ఆడియో క్లిప్పులతో యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. ఫిర్యాదు కూడా చేశారు. విషయం బయటకు పొక్కితే యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భావించిన అధికారులు.. ఇద్దరి మధ్య రాజీ కుదిరించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే అధికారుల ఎదుటే నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తా అంటూ సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధిత విద్యార్థినిని బెదిరించినట్లు సమాచారం.
గతంలో సైతం ఘటనలు..
శ్రీకాకుళం జిల్లాలో అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. ప్రభుత్వ ఏకైక యూనివర్సిటీ ఇది. అయితే ఇక్కడ అనేక వైఫల్యాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ల మధ్య విభేదాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రివాజ్. గతంలో కూడా ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయి. దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు కానీ.. లేనిపోని వివాదాలకు మాత్రం కారణమవుతోంది. తాజాగా ఈ ఘటనతో యూనివర్సిటీ చరిత్ర మరింత మసకబారింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి.