Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి లో చాలా మార్పు కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల బాటపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలు రచయితగా అడుగుపెట్టారు పోసాని. తరువాత దర్శకుడుగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి విభిన్న పాత్రలతో మెప్పించారు. అయితే మధ్యలో రాజకీయాల్లో ప్రవేశించి.. లేనిపోని వివాదాలు తెచ్చుకున్నారు. ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు మరోసారి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టారు.
* మళ్లీ సినిమాలు.
తాజాగా తన సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో రాజకీయ ప్రస్తావన వచ్చింది. మీడియా ప్రతినిధులకు దండం పెడుతూ.. నన్ను బతకనీయండి అంటూ విజ్ఞప్తి చేశారు. తానేదో సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరలేదని.. మంచి చేసిన పార్టీకి మాత్రమే అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో సేవా మాత్రమే కాదు చిక్కులు ఉంటాయని పరోక్షంగా తన జైలు జీవితం గురించి మాట్లాడారు. తాను పదవి చేపట్టినా.. రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి తన సినీ ప్రయాణం కొనసాగుతుందని తేల్చి చెప్పారు .
* ప్రజారాజ్యంతో ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పోసాని కృష్ణ మురళి. 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో బాహాటంగా మద్దతు తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే నిత్యం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబు విషయంలో కూడా చాలా చులకనగా మాట్లాడేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి కష్టాలు మొదలయ్యాయి. కేసుల మీద కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘకాలం జైలులో ఉండి పోవాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన పోసాని కృష్ణ మురళి ఒకానొక దశలో కన్నీరు మున్నీరు అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలపై దృష్టి పెట్టారు.