PM Kisan Scheme Update: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ తో పాటు పిఎం కిసాన్ నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7000, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.2000 అందించనున్నారు. ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేలు చొప్పున జమ కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి గత ఏడాది మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13000 అందించింది. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి తొలి విడతగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ.7000 జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరో రెండు విడతల్లో మిగతా రూ.14000 అందించి.. హామీ ఇచ్చిన మాదిరిగా రూ.20,000 సాయం పూర్తిగా అందించనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
పిఎం కి సాన్ నిరంతరంగా..
పిఎం కిసాన్ అనేది గత 21 విడతల్లో అందుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందిస్తూ వస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో మరో రూ.7500 జమ చేసేది మూడు విడతల్లో. అలా ఏడాదికి రూ.13,500 అందించేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే తాము అధికారంలోకి వస్తే రైతులకు సాగు సాయం కింద ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది నుండి అందిస్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి. అయితే ఈ ఏడాదికి సంబంధించి రేపు ఈ పథకం మొదటి విడత సాయం విడుదల చేయనున్నారు.
వేర్వేరుగా నిధుల విడుదల..
పీఎం కిసాన్ నిధులను పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ దివాస్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభవ నిధులను అదేరోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుంట్లలో సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ కింద ఏపీలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3125. 92 కోట్లు జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.5 కోట్లు. అయితే పీఎం కిసాన్ కు మాత్రం ఈ కేవైసీ తప్పనిసరి. ఎవరికైనా అర్హత ఉండి నిధులు అందకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
