AP Assembly Session: పవన్ సంచలనం.. జగన్ అవమాన భారం.. అసెంబ్లీలో ఎమోషనల్ సీన్స్

2014 ఎన్నికల నాటికి జనసేన ఆవిర్భవించింది. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. దీంతో వైసీపీ నుంచి అవమానాలను ఎదుర్కొన్నారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ఎద్దేవా చేశారు.

Written By: Dharma, Updated On : June 21, 2024 1:28 pm

AP Assembly Session

Follow us on

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇది సర్వసాధారణమైనా.. ఈసారి మాత్రం ప్రత్యేకమే. ముఖ్యంగా సభలో ప్రతి దృశ్యం వైరల్ అంశంగా మారిపోయింది. కోట్లాదిమందిలో భావోద్వేగానికి ఈ దృశ్యాలు కారణమయ్యాయి. అయితే అందరికంటే ప్రత్యేకంగా ఆకర్షించింది మాత్రం జనసేన అధినేత పవన్. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే ప్రత్యేకం అని చెప్పాల్సిన పనిలేదు. జనసేన ఏర్పాటు చేసి పదేళ్లు దాటుతోంది. ఎట్టకేలకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. పవన్ అధ్యక్షా అని ఎప్పుడు పిలుస్తాడా అని లక్షలాది మంది అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఈరోజు సభలో అది ఆవిష్కృతం అయ్యింది.

2014 ఎన్నికల నాటికి జనసేన ఆవిర్భవించింది. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. దీంతో వైసీపీ నుంచి అవమానాలను ఎదుర్కొన్నారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ఎద్దేవా చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అత్యధిక మెజారిటీతో గెలిచారు. డిప్యూటీ సీఎం హోదా తో పాటు నాలుగు మంత్రిత్వ శాఖలను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రమాణస్వీకారం వీడియో జన సైనికులకు, మెగా అభిమానులకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది.

రెండున్నర సంవత్సరాల కిందట అసెంబ్లీలో చంద్రబాబుకు దారుణ అవమానం ఎదురైంది. అప్పట్లో వైసీపీ సభ్యుల అవమానానికి చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే హౌస్ లో అడుగు పెడతానని శపధం చేశారు. అన్నమాట ప్రకారమే మళ్లీ సీఎం గా సభలో అడుగు పెట్టారు చంద్రబాబు. ఆయన ప్రమాణస్వీకారం చేయడం తెలుగుదేశం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. చంద్రబాబు కుమారుడు సైతం భావోద్వేగం నడుమ ప్రమాణస్వీకారం చేశారు. పవన్ మాదిరిగానే గత ఎన్నికల్లో ఓడిపోయారు లోకేష్. ఎన్నో రకాల అవమానాలను తట్టుకొని నిలబడ్డారు. 90 వేల మెజారిటీతో మంగళగిరిలో గెలుపొందారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సైతం టిడిపి శ్రేణులు భావోద్వేగానికి గురయ్యారు.

అయితే అందరిది ఒక ఎత్తు.. వైసీపీ శ్రేణులది మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి దాపురించింది. అసెంబ్లీలో దృశ్యాలు వైసీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ లేని వైభవం చూశారు జగన్. కానీ ఈసారి ప్రతిపక్ష హోదా కోల్పోయి.. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టారు. ప్రమాణం చేసిన సమయంలో కూడా తన పేరును పూర్తిగా పలక లేకపోయారు. ప్రమాణం చేసిన వెంటనే సభలో ఉండకుండా తన చాంబర్ కు వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది.