Site icon OkTelugu

Pawan Kalyan: పవన్ వెనుక గోతులు తవ్వుతున్నది ఎవరు?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పిఠాపురం( Pithapuram) నియోజకవర్గంలో మత్స్యకారులు రోడ్డు ఎక్కారు. ఉప్పాడ తీరంలో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తీర ప్రాంతంలో రసాయన పరిశ్రమల వల్ల వ్యర్ధాలు చేరుతుండడంతో.. మత్స్య సంపదకు అపార నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమం చేసినంత పని చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేవరకు తాము ఆందోళనను విరమించమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించారు. త్వరలో వచ్చి మత్స్యకారులతో మాట్లాడతానని.. సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తానని పవన్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. అయితే శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇక్కడ ఘటన జరగడం విశేషం. దీని వెనుక అదృశ్య శక్తి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* ఆయన అనుచరుల పైన..
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) బలపడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నడుమ.. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. అయితే అప్పటివరకు అక్కడ పోటీకి అన్ని విధాలా సంసిద్ధుడైన టిడిపి నేత వర్మ కలత చెందారు. మనస్థాపానికి గురయ్యారు. చంద్రబాబు సముదాయించడంతో పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే పిఠాపురంలో గెలిచిన పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. గెలిపించిన వర్మ కు మాత్రం ఇంతవరకు ఎటువంటి పదవి లభించలేదు. దీంతో వర్మతో పాటు అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరోవైపు పిఠాపురంలో తమ ప్రాధాన్యం తగ్గడంపై కూడా వారు ఆవేదనతో ఉన్నారు.

* జనసేనలో గ్రూపు తగాదాలు
పిఠాపురం జనసేనలో( janasena) సైతం గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ పార్టీ సమన్వయం కోసం ఐదుగురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఉప్పాడ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆందోళన వెనుక టిడిపి నేత వర్మ అనుచరులు ఉన్నారన్నది జనసేన నేతల అనుమానం. ప్రస్తుతం పర్యావరణ శాఖను కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. మత్స్యకారుల సమస్య కూడా పర్యావరణానికి సంబంధించినది. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులను ఎగదోయడం ద్వారా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలహీనపరచవచ్చని అంచనా తోనే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే పవన్ సైతం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Exit mobile version