Pawan Kalyan: జనసేన బలోపేతం పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు ఇన్చార్జులు, అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని.. పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేయనున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కార్యాలయానికి రావడం లేదు పవన్ కళ్యాణ్. కానీ 175 నియోజకవర్గాలకు ఇన్చార్జిలతో పాటు అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని చూస్తున్నారు. జాబితాలను తెప్పించుకుని నేతల సీనియారిటీ, సిన్సియారిటీని పరిశీలిస్తున్నారు.
* సంస్థాగతంగా బలోపేతం..
జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు. మరో రెండు పార్లమెంటు సీట్లను సైతం కైవసం చేసుకున్నారు. అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు తాత్కాలికంగా ఇన్చార్జిలు కొనసాగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బహుముఖ నాయకత్వం ఉంది. వారు ఏకతాటిపైకి రావడం లేదు. అందుకే ఇన్చార్జిలను నియమించి వారి పరిధిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది మరోవైపు జిల్లాల అధ్యక్షులు నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణలను పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం బలంగా ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా ఈసారి రాయలసీమపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అక్కడ 54 నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఇన్చార్జిలను నియమించడం ద్వారా.. పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.
* స్థానిక సంస్థలపై గురి..
స్థానిక సంస్థల్లో సింహభాగం పొందాలన్నది కూడా ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఈసారి జిల్లాలు పెరిగాయి. జిల్లా పరిషత్ స్థానాలు పెరగనున్నాయి. ఆపై 12 కార్పొరేషన్లతో పాటు 100కు పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. తప్పకుండా అందులో చాలా వరకు జనసేన తీసుకోవాలని చూస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తుంటే నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో బాధ్యులు లేరు. పార్టీ జిల్లా అధ్యక్షులు సైతం నామమాత్రంగానే ఉన్నారు. అందుకే ఏకకాలంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలతో పాటు జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలను సైతం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకొని క్రోడీకరిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ నియామకాలపై ప్రత్యేక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.