Pawan Kalyan: ఏపీలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నాయి. అటు అధినేతలు సైతం రంగంలోకి దిగారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారానికి దిగారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ నుంచి జనసేన కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు పిఠాపురం లోనే పవన్ గడపనున్నారు. జనసేన, టిడిపి, బిజెపి శ్రేణులతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. పిఠాపురం తో పాటు జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ముందుగా ఆ 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేయనున్నారు. ఆ నియోజకవర్గాల్లో పర్యటన పూర్తయిన వెంటనే.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యలో భాగస్వామ్య పక్షాల అధినేతలతో భారీ బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ మారింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలోనే పర్యటించనున్నారు. ఏప్రిల్ 3 న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి,7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరంలో పవన్ పర్యటించనున్నట్లు తెలిపారు.