Pawan Kalyan: మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ ఓ వ్యాఖ్య చేశారు. తనపై కామెంట్స్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి.. చేసుకోనివ్వండి అంటూ చాలా సిల్లీగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే అంశాన్ని సీరియస్గా తీసుకొని ఒక బలమైన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను ఉక్కు పాదంతో అణచివేయనున్నారు. అయితే చాలా రోజులపాటు సహనంతో వ్యవహరించారు పవన్. కానీ రోజురోజుకు శృతిమించుతోంది సోషల్ మీడియా ధోరణి. జీవితంలో కనీస స్థాయి విజయం లేదా పది పైసల యోగ్యత లేని వారు కూడా రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించాలంటే ఎంచుకునే మార్గం పవన్ కళ్యాణ్. గత పదేళ్ల ప్రస్థానం చూస్తే సోషల్ మీడియా చాలా హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మీడియాతో పాటు సోషల్ మీడియా నడిపిన వ్యాపార కోణంలో పవన్ కళ్యాణ్ ఒక ఆదాయ వనరుగా మారారు. ఆయనను టార్గెట్ చేసుకుంటే వ్యూస్ తో పాటు టిఆర్పి రేటింగ్స్ వస్తాయి అన్నది వారి ఆలోచన.
* కనీస యోగ్యత లేని వారు…
కత్తి మహేష్ అనే వ్యక్తి విమర్శల దగ్గర నుంచి ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి. మొన్నటి ఎన్నికల ముందు వరకు శ్రీ రెడ్డి పురుష పదజాలం గురించి అందరికీ తెలిసిన విషయమే. పోసాని కృష్ణ మురళి ఆవేశపూరిత వ్యాఖ్యలు, రామ్ గోపాల్ వర్మ తీసిన పేరడీ సినిమాలు.. ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ పబ్బం గడుపుకున్నారు. తాజాగా ఏలూరు దళిత క్రైస్తవుల సభలో సీఎం, డిప్యూటీ సీఎం లపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు బచ్చలకూరి జోసఫ్ అలియాస్ కృష్ణ రావణ్. వీరందరిదీ ఒకటే సూత్రం.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే.. ఆదాయం పెంచుకోవచ్చు అనేది వీరి ఆలోచన. ఉద్దేశపూర్వకంగానే నిలకడ లేని వ్యక్తులకు వేదికలు కల్పించారు. కనీస నైతిక విలువలు లేకుండా పవన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ.. లైవ్ డిబేట్ లు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
* బలమైన చట్టవ్యవస్థ..
అయితే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి రకరకాలుగా లబ్ది పొందారు. అనైతిక కార్యక్రమాలు రోజురోజుకు పెరుగుతుండడంతో పవన్ కళ్యాణ్ లో సహనం నశించింది. అందుకే చట్టబద్ధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మునుపటిలా వ్యూస్ వస్తాయని.. టిఆర్పి రేటింగ్ వస్తుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కూడా. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా, అత్యంత శక్తివంతమైన ప్రజానాయకుడిగా పవన్ అవతరించారన్న విషయాన్ని గ్రహించుకోవాలి. సోషల్ మీడియా దుర్వినియోగానికి, విద్వేష పూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక విచారణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కచ్చితంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
* విచారణకు వణకాల్సిందే..
ఒక బలమైన సైబర్ క్రైమ్ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక కేసులో బెయిల్ రాగానే మరో పాత కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం, న్యాయస్థానాలు సైతం సమాజంలో విద్వేషాలు రగిలించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం చూస్తుంటే.. వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయని అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్ ను దూషించి పెద్దవారు అవుతాం అనుకున్న వారు.. చట్టం కొట్టే దెబ్బకు చితికి పోవాల్సిందే. ఇకనుంచి ఇటువంటి విచారణలకు హాజరయ్యేందుకు కూడా భయపడాల్సిందే.

