Homeఆంధ్రప్రదేశ్‌Paripoornananda Swami: కూటమికి స్వామీజీ చిక్కులు

Paripoornananda Swami: కూటమికి స్వామీజీ చిక్కులు

Paripoornananda Swami: ఏపీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వాల్సి రావడంతో చాలామంది టీడీపీ సీనియర్ నేతలకు చోటు లేకుండా పోయింది. వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే సమయం ఉండడంతో బుజ్జగించేందుకు హై కమాండ్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కొన్నిచోట్ల వర్కౌట్ అవుతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం అసంతృప్త నేతలు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో బిజెపి పట్టుబట్టి మరి సీట్లను సొంతం చేసుకుంది. అటువంటి చోట్ల టిడిపి సీనియర్ల సహకారం ఎంత మేరకు ఉంటుందో చూడాలి.

ఒకవైపు టిడిపి సీట్లు త్యాగం చేసి బాధపడుతుంటే.. మరోవైపు బిజెపి నేతల కదలికతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో బిజెపికి రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే బిజెపి టికెట్ కోసం ఆశించిన పరిపూర్ణానంద స్వామీజీ ఇప్పుడు ఎదురు తిరగడంతో బిజెపితో పాటు టిడిపి కలవర పడుతోంది. హిందుత్వవాదంలో స్వామీజీ ముందంజలో ఉంటారు. హిందూ మతం కోసం పరితపిస్తుంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉండడంతో బిజెపికి కనెక్ట్ అయ్యారు. మోడీ విధానాలను ప్రశంసిస్తుంటారు. అయితే ఈ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. లేకుంటే కనీసం అసెంబ్లీ సీటు కైనా తన పేరు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కానీ బిజెపి హై కమాండ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పరిపూర్ణానంద స్వామికి టికెట్ కేటాయించలేదు.

ప్రస్తుతం స్వామీజీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కీలక నిర్ణయానికి వచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హిందూపురం లోక్సభ స్థానంతో పాటు అసెంబ్లీ సీటు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి నేత బీకే పార్థసారథి, అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎలాగైనా అనంతపురం జిల్లాలో సత్తా చాటాలని భావిస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే స్వామీజీ అసంతృప్తితో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. సరిహద్దు ప్రాంతం కావడం, హిందుత్వ భావజాలం కలిగివున్న ప్రాంతాలు కావడంతో.. స్వామీజీ ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి నేతలకు ఇదో ఇబ్బందికర పరిణామంగా మారుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version