Uttarandhra Development: ఉత్తరాంధ్రకు ( North Andhra) వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ఇటీవలే గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అంతకుముందు ఏ యూ శతాబ్ది ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆనంద సమయంలోనే మరో వార్త చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. కొత్త రైల్వే జోన్ కు సంబంధించి జూన్ 1న నోటిఫై చేయబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతేకాదు దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో కొత్తగా మరో రెండు సెక్షన్లు కలపాలని సీఎం చంద్రబాబు రైల్వే మంత్రిని కోరారు. ఇది నిజంగా ఉత్తరాంధ్రకు తీపి కబురు. ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నెరవేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేలా ఉన్నాయి.
* అధికారుల నియామక ప్రక్రియ
ఇప్పటికే విశాఖలో( Visakhapatnam) దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి కీలక అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేశారు. మరికొందరు అధికారులను నియమించాల్సి ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో పనిచేసేందుకు ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్ లు కోరగా.. దాదాపు 3,000 మంది వరకు ఆసక్తి వ్యక్తం చేశారు. విశాఖ జి ఎం కార్యాలయంలో పనిచేయడానికి 1200 మంది సిబ్బంది అవసరం. మొత్తం ఈ జోన్ లో 17,000 మంది వరకు సిబ్బంది పనిచేయనున్నారు. అయితే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జూన్ 1 నుంచి జూన్ నోటిఫై విషయం ప్రకటించగా.. సీఎం చంద్రబాబు మరికొన్ని ప్రతిపాదనలతో విజ్ఞప్తి చేశారు. విశాఖ కేంద్రంగా ఉన్న ఈ కొత్త జోన్లు రాష్ట్ర పరిధిలోని మరికొన్ని సెక్షన్లు విలీనం చేయాలని కోరారు. ఏపీ పరిధిలో ఉన్న అరకు- కొత్తవలస, కర్నూలు డోన్ సెక్షన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో విలీనం చేయాలని కోరారు. దీనిపై రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు.
* విభజన హామీల్లో భాగంగా..
రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి కొత్త జోన్ అనేది విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం 2019 ఫిబ్రవరిలో జూన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అటు తరువాత అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ పై కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. 2025 జనవరిలో డిపిఆర్ కు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం కోసం శంకుస్థాపన జరిగింది. అయితే గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. అయితే జూన్ 1 నుంచి నోటిఫై చేస్తామని స్వయంగా రైల్వే శాఖ మంత్రి ప్రకటించడంతో ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరనుంది.