North Andhra benefits: ఇప్పుడు అంతటా నియోజకవర్గాల పునర్విభజన పై చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్నట్లు ఎన్డీఏ సమావేశంలో కేంద్ర పెద్దలు స్పష్టతనిచ్చారు. ఏకంగా 50% సీట్లు దేశవ్యాప్తంగా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 88 అసెంబ్లీ సీట్లు.. ఓ 13 వరకు ఎంపీ సీట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రాజకీయ ఆశావహులతో పాటు వారసుల్లో ఇప్పుడు అంచనాలు పెరుగుతున్నాయి. ఏ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయో అన్నదానిపై చాలా రకాల చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి? ఎక్కడెక్కడ పెరుగుతాయి? అనే అంశాలపై చర్చిస్తున్నారు ఎక్కువమంది.
భారీగా పెరగనున్న నియోజకవర్గాలు..
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి, అరకు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే పునర్విభజనతో ఉత్తరాంధ్రలో ఓ 17 వరకు నియోజకవర్గాలు పెరగవచ్చు అన్నది ఒక అంచనా. ఈ లెక్కన 51 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు చేరుకోవచ్చు. మరోవైపు రెండు పార్లమెంట్ సీట్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఆశావహులకు ఇదో చక్కటి అవకాశం. ఉత్తరాంధ్రలో పార్టీలు దక్కించుకునే దాన్ని బట్టి అధికారంలోకి వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టనున్నాయి.
Also Read: నియోజకవర్గాల పునర్విభజన.. ఏపీలో మహిళల నియోజకవర్గాలు ఇవే!
ఉమ్మడి జిల్లాల వారీగా లెక్క..
విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఎనిమిది నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు విజయనగరంలో 9 అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మరో నాలుగు పెరిగే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఐదు వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు జిల్లాలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలం. ఇప్పుడు టిడిపికి జనసేనతో పాటు బిజెపి సహకారం ఉండడంతో నియోజకవర్గాల పెంపు అనేది కూటమికి ప్రయోజనం అని విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రాజకీయ వారసులు చాలామంది ఉన్నారు. వారంతా పోటీ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాలు భారీగా పెరుగుతుండడంతో వారికి ఆశలు చిగురిస్తున్నాయి. పునర్విభజనను వారు స్వాగతిస్తున్నారు. అయితే పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టడంతో నేతలు సైతం తమకు అనుకూలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకునే పనిలోపడ్డారు. సామాజిక లెక్కలు వేసుకుని ఫలానా మండలాలతో కొత్త నియోజకవర్గ ఏర్పాటు అవుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
