Nara Lokesh: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన తన చతురతను ప్రదర్శించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే పారిశ్రామిక సదస్సులో ఏపీ ప్రాధాన్యత వివరిస్తూ.. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరసలో నిలిచారు నారా లోకేష్. తాజాగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా ప్రయాణమయ్యారు. పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు ఆయన ఈరోజు అక్కడకు చేరుకోనున్నారు. ఈరోజు నుంచి 11వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. కొరియా రాజధాని సియోల్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు, ఆటోమొబైల్, సెమీ కండక్టర్ రంగాల ప్రతినిధులతో లోకేష్ వరుసగా భేటీ కానున్నారు. ఇటీవల ఢిల్లీలో దక్షిణ కొరియా రాయబారి లీ సీయోంగ్-హోతో జరిగిన ప్రాథమిక చర్చల కొనసాగింపుగానే లోకేష్ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది.
* బిజీ షెడ్యూల్..
వారం రోజులపాటు దక్షిణ కొరియాలో బిజీగా గడపనున్నారు లోకేష్. ఈరోజు ముందుగా సీయోల్ చేరుకుంటారు. అక్కడ నివసిస్తున్న తెలుగు వారితో ఆత్మీయ సమావేశం కానున్నారు. రేపు కొరియాకు చెందిన టాప్ టెక్ స్టార్టాప్స్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరిస్తారు. అదేరోజు అక్కడి భారీ పరిశ్రమల సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారినే ఆహ్వానిస్తారు.
* దిగ్గజ పారిశ్రామికవేత్తలతో..
లోకేష్ పర్యటనలో 7, 8 తేదీలు అత్యంత కీలకం. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జి ప్రధాన కార్యాలయం ఎల్జి టవర్స్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎల్జి కెం గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు లోకేష్. ఏపీలో ఎల్జి అనుబంధ సంస్థల ఏర్పాటు విషయమై చర్చిస్తారు. జూలై 8, 9 తేదీల్లో కొరియన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇంటర్నేషనల్ ట్రీట్, ఇన్వెస్ట్మెంట్స్ విభాగాల డిప్యూటీ మంత్రులతో ద్వైపాక్షిక పారిశ్రామిక సంబంధాలపై లోకేష్ భేటీ అవుతారు. పర్యటన ముగింపు నాడు అంటే జూలై 10 కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో కూడా ఉంటుంది. అయితే లోకేష్ పర్యటన ప్రధాన ఉద్దేశం విశాఖ సిఐఐ సదస్సు. దానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూనే కొరియన్ ప్రతినిధులతో కీలక చర్చలు జరుపుతారు లోకేష్.

