Homeఆంధ్రప్రదేశ్‌Lokesh Yoga Narasimha Swamy temple visit: యోగ నరసింహుడికి నారా లోకేష్ పూజలు.. ఈ...

Lokesh Yoga Narasimha Swamy temple visit: యోగ నరసింహుడికి నారా లోకేష్ పూజలు.. ఈ ఆలయానికి ఎంతటి చరిత్ర ఉందో తెలుసా..

Lokesh Yoga Narasimha Swamy temple visit: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని షోలింగూర్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన యోగ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలను నారా లోకేష్ తెలుసుకున్నారు. అనంతరం రోప్ వే లో ప్రయాణించి.. ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నారా లోకేష్ పరిశీలించారు

యోగ నరసింహస్వామి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని షోలింగూర్ బస్ స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది శ్రీ వైష్ణవుల 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. స్వామివారి ఆలయం పెరియమలై అనే కొండ మీద ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి వారు యోగ భంగిమలో ఉంటారు. ఈ కొండ వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారి ఆలయాన్ని చేరుకోవాలంటే దాదాపు 1305 మెట్లు ఎక్కాలి.

ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని అమృతవల్లి తాయారు అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారు యోగాసనంలో కనిపిస్తూనే సాలగ్రామ హార, చతుర్భుజ ఆకారంలో కూర్చొని ఉంటారు. స్వామివారి చేతుల్లో శంఖం.. చక్రాలు ఉంటాయి. మిగతా రెండు చేతులు ధ్యాన భంగిమను ప్రదర్శిస్తాయి.

చారిత్రాత్మకమైన ఆధారాల ప్రకారం నరసింహస్వామి విష్ణుమూర్తి నాలుగవ అవతారం. హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత.. ఈ కొండ మీదికి చేరుకుంటాడు. అక్కడ ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తర్వాత యోగ భంగిమలో ఇక్కడ కొలువై ఉన్నాడు.. ఈ ఆలయంలో స్వామివారిని పూజిస్తే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం ఉంటుంది. మానసిక వ్యాధులు.. అనారోగ్య సమస్యల నుంచి బాధపడేవారు ఈ స్వామివారిని దర్శించుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇన్ని మెట్లు ఎక్కలేని వారికి డోలి సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఇక్కడ ఉన్న ఒక చిన్న కొండ మీద శ్రీ యోగాంజనేయుడు కొలువై ఉంటాడు. ఇది కూడా 350 అడుగుల ఎత్తులో ఉంటుంది. 400 మెట్లు ఎక్కితే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నరసింహ జయంతి.. చైత్ర బ్రహ్మోత్సవం.. పంగుని తిరుకల్యాణం ఘనంగా జరుపుతుంటారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. నారా లోకేష్ స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో.. ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular