Nara Lokesh: నారా లోకేష్ దూకుడు పెంచారు. వైసిపి నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్రలో శంఖారావం పేరిట సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున సభలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంలో సభలు ముగించిన ఆయన విజయనగరంలో అడుగుపెట్టారు. ఇలా అడుగుపెడుతూనే సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నది డమ్మీ క్యాబినెట్ అని.. చెత్త గుంపు అని లోకేష్ తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహాన్ని అనుసరించి లోకేష్ విరుచుకుపడుతుండడం విశేషం.
పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు లోకేష్ అండగా నిలబడ్డారు. ఆమెపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. పేటీఎం కూలీలకు ఐదు రూపాయలు ఇచ్చి షర్మిల పెళ్లి, పుట్టుక గురించి నీతి లేకుండా విమర్శలు చేయిస్తున్న జగన్ వైఖరిని తప్పు పట్టారు. ఆమె పెళ్లి, పుట్టుక ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. వైఎస్ పేరు చెప్పుకునే బతికే జగన్ కు ఇది అవమానం కాదా? అని నిలదీశారు. షర్మిలపై జగనే దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఓ 420 అని.. ఆయన సలహాదారులు 840 అని అభివర్ణించారు.
బొత్స సత్యనారాయణ కుటుంబం పై లోకేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మంత్రి బొత్స పెన్నులో ఇంకు అవినీతి ఫైళ్లపై సంతకాలు చేసేందుకే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లాకు క్యాన్సర్ గడ్డలా తయారైందని మండిపడ్డారు. బొత్స అనే క్యాన్సర్ గడ్డకు ఓటు అనే రేడియేషన్ అవసరమని చమత్కరించారు. ఆ కుటుంబాన్ని విజయనగరం జిల్లా నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టిడిపి నుంచి నాయకులు మారినా.. కార్యకర్తలు అలానే ఉన్నారని.. వారందరికీ సముచిత స్థానం కల్పించే బాధ్యత తనది అంటూ లోకేష్ తెల్చి చెప్పారు.
మరోవైపు లోకేష్ రెడ్ బుక్ బయటకు తీశారు. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టా రాస్తున్నానని.. అందరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ అసమర్థుడంటే ఆయన మంత్రివర్గమంతా చెత్తతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మంత్రుల అవినీతిపై సమగ్ర విచారణ చేపడతామని.. ప్రతి ఫైలు క్షుణ్ణంగా పరిశీలిస్తామని లోకేష్ హెచ్చరించారు. మొత్తానికైతే లోకేష్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.