AP MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు..ఆ ఇద్దరూ అదృష్టవంతులు ఎవరో?

టిడిపి కూటమి అంతులేని మెజారిటీని కైవసం చేసుకుంది. 166 స్థానాలతో పటిష్టమైన స్థితిలో ఉంది. టిడిపి ఒక్కటే ఒంటరిగా 135 సీట్లలో గెలుపొందింది.

Written By: Dharma, Updated On : June 19, 2024 3:23 pm

AP MLC Elections

Follow us on

AP MLC Elections: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి సంబంధించి ఎన్నిక జరగనుంది. ఈనెల 25న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించనుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ పై అనర్హత వేటుపడడంతో.. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక అనివార్యంగా మారింది. ఆ ఇద్దరూ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నవారే. ఎవరైనా ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా, అనర్హత వేటుపడినా మూడు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడి రెండు నెలలు దాటుతోంది. అందుకే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెల్లడించింది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీల ఎన్నిక లాంఛనమే. కనీసం పోటీ పెట్టే పరిస్థితిలో వైసీపీ లేదు.

టిడిపి కూటమి అంతులేని మెజారిటీని కైవసం చేసుకుంది. 166 స్థానాలతో పటిష్టమైన స్థితిలో ఉంది. టిడిపి ఒక్కటే ఒంటరిగా 135 సీట్లలో గెలుపొందింది. ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యారు ఎమ్మెల్సీలను ఏకపక్షంగా కూటమి గెలుచుకోనుంది.అయితే ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారన్న చర్చ బలంగా నడుస్తోంది. పొత్తులో భాగంగా చాలామంది టిక్కెట్లు వదులుకున్నారు. త్యాగం చేశారు. అటువంటి వారికి ప్రత్యామ్నాయ రూపంలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆశావహులంతా పావులు కదుపుతున్నారు. శాసనమండలి నుంచి ఒకరిని తీసుకుని మంత్రి పదవి కేటాయిస్తారని.. అందుకే క్యాబినెట్లో కేవలం 24 మందిని మాత్రమే భర్తీ చేశారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీగా వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు రాధ. కానీ పోటీ చేసేందుకు ఛాన్స్ దక్కలేదు. కేవలం అప్పట్లో ప్రచారానికి పరిమితమయ్యారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. కానీ గత ఐదేళ్లుగా వేరే పార్టీలో చేరలేదు.ఈ ఎన్నికల్లో సైతం టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. ఈసారి కూడా అంకితభావంతో ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 తర్వాత రాధ పొలిటికల్ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు రాధా కెరీర్ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు తిరుగులేదు. అది టిడిపి గెలిచే సీటు కూడా. అటువంటి సీటును పవన్ కోసం త్యాగం చేశారు వర్మ. పవన్ విజయానికి కృషి చేశారు. పవన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి తీసుకొస్తానని చంద్రబాబుకు మాట ఇచ్చారు వర్మ. అటు పవన్ సైతం వర్మ విషయంలో సానుకూలంగా ఉన్నారు. తన కోసం సీటు త్యాగం చేసిన వర్మకు న్యాయం చేయాలని కూడా చంద్రబాబుకు పవన్ కోరినట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా మైలవరం సీటు వదులుకున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అటు తెనాలి టికెట్ను నాదెండ్ల మనోహర్ కు ఇచ్చేందుకు సమ్మతించారు మాజీ మంత్రి ఆలపాటి రాజా. వారు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.