AP Liquor policy : పాపం మంత్రి నారాయణ.. 100 షాపులకు దరఖాస్తు చేస్తే.. వచ్చింది మూడే!

ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎంతగానో కష్టపడింది. అనుకున్న ఫలితం వచ్చింది. దీంతో తమకు తిరుగు లేదని వారంతా భావించారు. పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు దక్కించుకోవచ్చు అని చూశారు. కానీ తమ నేతల ద్వారా జరిగిన ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు.

Written By: Dharma, Updated On : October 15, 2024 11:29 am

AP Liquor policy

Follow us on

AP Liquor policy :  మద్యం షాపుల లాటరీలో చాలామంది నేతలకు బ్యాడ్ లక్ ఎదురైంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారికి అనుకున్న స్థాయిలో షాపులు దక్కలేదు. అయితే మరికొందరికి మాత్రం అనూహ్యంగా దక్కడం విశేషం. అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ఏకంగా ఐదు షాపులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం షాపుల్లో ఎక్కువ శాతం టిడిపి, వైసీపీకి చెందిన వారికే దక్కడం విశేషం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న 20 షాపుల్లో.. 9 షాపులు వైసీపీ కౌన్సిలర్ తో సహా సానుభూతిపరులకు దక్కాయి. అనంతపురం జిల్లాలో టిడిపికి చెందిన మహిళలు 14 షాపులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలోని 20 మద్యం షాపుల్లో.. పదికి పైగా జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు లాటరీలో దక్కించుకున్నట్లు సమాచారం. అనంతపురం అర్బన్ లో 30 దుకాణాలకు గాను 15 కు పైగా స్థానిక ఎమ్మెల్యే అనుచరులే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల పరిమిత దరఖాస్తులు రావడంతోనే నేతల అనుచరులకు చాన్స్ రావడం విశేషం. దరఖాస్తుల నమోదు సమయంలోనే దాదాపు నియంత్రించినట్లు ప్రచారం సాగుతోంది.

* కొందరు నేరుగా రంగంలోకి
అయితే తమను గెలిపించిన నేతల కోసం కొందరు మంత్రులు నేరుగా రంగంలోకి దిగారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి అయితే ముందుగానే వ్యాపారులతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. వీలైనంతవరకు దరఖాస్తులు వేయవద్దని.. తమ పార్టీ నేతలకు వదిలివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దాదాపు అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలపై ఒత్తిడి ఉంది. అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సిండికేట్ గా మారి షాపులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

* రెండు కోట్లు పెట్టిన మంత్రి నారాయణ
మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కు మద్యం షాపుల విషయంలో షాక్ తగిలింది. మొన్నటి ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల కోసం తన సొంత డబ్బులు రెండు కోట్ల రూపాయలతో 100 షాపులకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం మూడు షాపులు దక్కడం విశేషం. అయితే ఇలా దక్కిన మూడు షాపులను.. ఒక్కో షాపును 15 మందికి చొప్పున.. 45 మంది నేతలకు పంచేసినట్లు తెలుస్తోంది.అయితే ఇంకా చాలామంది నేతలకు అవకాశం లేకపోవడంతో ఒక రకమైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.