Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే చాన్స్ ఉంది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని.. ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు అని సూచిస్తున్నారు.
* ఉత్తరాంధ్ర పై ప్రభావం..
ఈ అల్పపీడనం ప్రధానంగా ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈదురుగాలుల ప్రభావం ఉండను ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జూన్లో చాలా లోటు కనిపించింది. ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంది. రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. విస్తరించడంలో కూడా మందగమనం కనిపించింది. కానీ తాజా ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.
* ఆశించిన స్థాయిలో వర్షాలు లేక..
దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఉత్తర భారత దేశంలో కూడా వర్షాలు అనుకున్న స్థాయిలో పడటం లేదు. ప్రధానంగా దేశవ్యాప్తంగా 350 కి పైగా జిల్లాల్లో వర్షపాతం లోటు ఉంది.. ఖరీఫ్ సీజన్లో జూన్ కీలకం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్లో విస్తారంగా వర్షాలు పడితేనే ఖరీఫ్ గట్టెక్కేది. అటువంటి జూన్లోనే వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు జూలై మొదటి వారం ప్రవేశించిన ఇంకా వర్షాలు ఆశించిన స్థాయిలో పడటం లేదు. తాజాగా ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణాదిన ఏపీలో ఒడిస్సా తో పాటు పశ్చిమ బెంగాల్ పై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా జూన్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు అల్పపీడనాల ప్రభావం, తుఫాన్లు సంభవిస్తుంటాయి. కానీ ఇంతవరకు వాటి జాడలేదు. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

