Pawan Kalyan: ఒక్క దెబ్బతో కోట్ల ధరలు పెంచేసిన పవన్ కళ్యాణ్

సాధారణంగా పిఠాపురంలో వ్యవసాయ భూముల ధరలు.. ఎకరా 15లక్షల నుంచి 20 లక్షలు పలుకుతూ వస్తోంది. అదే జాతీయ రహదారి పక్కన అయితే 50 లక్షలు వరకు ఉంది.

Written By: Dharma, Updated On : July 6, 2024 4:18 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీలో పిఠాపురం ఒక సామాన్య నియోజకవర్గం. ఇప్పుడు మాత్రం సెలబ్రిటీ నియోజకవర్గంగా మారింది. కుప్పం, పులివెందుల, హిందూపురం వంటి నియోజకవర్గాల సరసన చేరింది. జనసేన అధినేత పవన్ పోటీ చేసిన నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పవన్ ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎం కావడంతో మరింత ప్రాధాన్యత దక్కించుకుంది. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని ప్రకటించారు. ఇంటి స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ భూముల ధరలు పెరగడం విశేషం.

సాధారణంగా పిఠాపురంలో వ్యవసాయ భూముల ధరలు.. ఎకరా 15లక్షల నుంచి 20 లక్షలు పలుకుతూ వస్తోంది. అదే జాతీయ రహదారి పక్కన అయితే 50 లక్షలు వరకు ఉంది. ఈ తరుణంలో క్యాంపు కార్యాలయం తో పాటు ఇంటిని నిర్మించుకునేందుకు పవన్ కళ్యాణ్ మూడు ఎకరాల 52 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్కనే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి మార్కెట్ విలువ అక్షరాల 50 లక్షల 5000. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇదే విషయాన్ని భారీ బహిరంగ సభలో ప్రకటించారు పవన్.

అయితే పవన్ ఇలా భూములు కొనుగోలు చేశారో లేదో.. ఆ ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి జనసేన నాయకులు, రియాల్టర్లు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. పవన్ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోనుండడంతో ఆ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అందుకే అక్కడ భూమిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే ఇదే అదునుగా అక్కడ భూముల ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ ప్రాంతంలో చూసినా ఎకరా కోటి రూపాయలకు తగ్గడం లేదని సమాచారం. కొన్ని చోట్ల అయితే ఎకరా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పలుకుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఈ ధరలు లేవని.. పవన్ రాకతోనే ధరలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.