Kodali Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు బిగుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అప్పట్లో మంత్రిగా ఉంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కొడాలి నాని పై ఉన్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడే గుడివాడ నియోజకవర్గంలో అప్పటి అధికారులపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని… వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అదే జరిగితే మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి కూటమి పార్టీల శ్రేణులు. ఎట్టకేలకు కొడాలి నాని పై విచారణ ప్రారంభం కానుండడంతో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంటాయని అంచనా వేస్తున్నారు.
* ఇళ్ల స్థలాల్లో అవినీతి..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ తన తొలి క్యాబినెట్ లోనే కొడాలి నాని కి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను అందించారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో సైతం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ అప్పటి గుడివాడ ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. ఈ విషయంలో కొడాలి నాని రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారంటూ అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. కొంతమంది ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ పై ఫిర్యాదులు కూడా చేశారు. కానీ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే అప్పటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక అధికారి రమేష్ పై విచారణ చేపట్టడమే కాదు ఈ విషయంలో కొడాలి నాని నుంచి ఎదురైన రాజకీయ సిఫారసులపై కూడా దర్యాప్తు చేయాలని… నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.
* వరుసగా కేసులు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్టయ్యారు కూడా. అయితే ఆ వంతు కొడాలి నాని వరకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు. అయితే కేసులతో ఉక్కు పాదం మోపుతారని భావిస్తున్న వేళ కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ముంబాయిలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది. తరువాత చాలా రోజులు హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. ఇటీవల పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై పాత కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. మున్ముందు ఆయనపై గతంలో వ్యవహరించిన అనుచిత వైఖరిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ తరహాలో.. కొడాలి నానికి సైతం ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
