KCR Bus Yatra: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భిన్నంగా కొనసాగుతాయి. కానీ ఒక విషయంలో మాత్రం సారూప్యత ఉంది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి తీరు ఒకేలా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరిదీ ఒకటే అహంభావం. అధికారం కోల్పోయాక ఇద్దరు ఇళ్లకే పరిమితం అవుతూ వస్తున్నారు. పెద్దగా జనం మధ్యకు రావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. ఏపీలో మాత్రం ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అయితే ఇప్పుడు కెసిఆర్ జనం మధ్యకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. పాదయాత్ర పేరు చెప్పి ఆయన జనం మధ్యకు వచ్చే షెడ్యూల్ను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఇప్పుడు కెసిఆర్ ప్రకటనతోనైనా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా? అన్నది చూడాలి.
* ఫామ్ హౌస్ కు పరిమితం..
తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న గులాబీ కాంగ్రెస్ పార్టీ చేతిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటినుంచి కెసిఆర్ ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అసెంబ్లీకి సైతం హాజరు కావడం లేదు. కేటీఆర్ తో పాటు హరీష్ రావుతో కథ నడిపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని మొన్న ఆ మధ్యన లీకులు ఇచ్చారు. కానీ అటువంటి సభలు ఏవి నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ హడావిడి ప్రారంభమైంది గులాబీ పార్టీలో. కనీసం ఈ బస్సు యాత్ర అయినా చేపడతారా లేదా అన్నది చూడాలి.
* జనంలోకి వస్తానని చెప్పి..
జగన్మోహన్ రెడ్డి సైతం 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. 2025 సంక్రాంతి నాటికే జనంలోకి వచ్చేస్తాను అంటూ ప్రకటనలు చేశారు. అటు తరువాత మరో సంక్రాంతి దాటిపోయింది కానీ ఆయన ప్రజల ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చే ఏడాది జూలై నుంచి పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటానని చెబుతూ వచ్చారు. అంతకుముందు పార్టీ ప్లీనరీ నిర్వహించాలి. కానీ అటువంటి సన్నాహాలేవీ ప్రారంభించలేదు. మరోవైపు పాదయాత్రకు ఇంకా ఏడాది సమయం ఉంది. పాదయాత్ర తో ముడిపెట్టి జనాల్లోకి వస్తే ఎంత మాత్రం ప్రజలు హర్షించే పరిస్థితుల్లో ఉండరన్న టాక్ ఉంది. ఎందుకంటే గతం పాదయాత్ర వేరు.. ఇప్పుడు పాదయాత్ర వేరు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారన్న సంకేతాలు కచ్చితంగా వెళ్తాయి. దానిని ప్రజలు హర్షించరు కూడా. అయితే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ చేస్తున్న రాజకీయమే అధికార పార్టీకి శ్రీరామరక్ష అన్నట్టు ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…

