YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం కొనసాగుతోంది. ఎవరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందో.. వారు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. పార్టీలో సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. ఈ భిన్న వాతావరణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. 2019 నుంచి 2024 మధ్య కొంతమంది నేతల వ్యవహార శైలితోనే పార్టీకి ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ప్రారంభంలో వారి మాటలు గొప్ప ఫ్యాషన్ గా అనిపించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సైతం ఆకర్షించాయి. కానీ రాను రాను ఆ నేతల తీరుతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనస్థితికి చేరుకుందనేది పార్టీ క్యాడర్ కు తెలిసింది. పార్టీలో సీనియర్లు మౌనం వహించి.. దూకుడు కలిగిన నేతలు మాటలు పార్టీకి చేటు తెచ్చాయి అని ఆలస్యంగా తెలిసింది. అప్పటికే మూల్యం చెల్లించుకుంది పార్టీ. అయితే ఇప్పుడు క్యాడర్ తెలుస్తుంది కానీ.. నాయకత్వం తెలుసుకోకపోవడం పార్టీకి లోటు.
* ఫైర్ బ్రాండ్లుగా ముద్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు సాధించారు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జూనియర్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు. వారి మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంతో ఇష్టంగా ఉండేవి. అయితే వారి మాటలు తటస్థులతోపాటు విద్యాధికులపై విపరీతంగా ప్రభావం చూపించాయి. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం.
* పక్కన పెట్టినట్టే పెట్టి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చిన ఆ దూకుడు నేతలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు కనిపించారు ప్రారంభంలో. గత అనుభవాల దృష్ట్యా సీనియర్ల సేవలను వినియోగించుకుంటానని జగన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్లుగా ఉన్న ధర్మాన, బొత్స లాంటి నేతలు మాట్లాడడం ప్రారంభించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. కానీ ఆ సరదా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఎవరైతే బూతులు మాట్లాడారో.. అడ్డగోలుగా వ్యవహరించారో.. అటువంటి నేతలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో సీనియర్లుగా ఉన్న ధర్మాన లాంటి వారు మళ్లీ మౌనం పాటిస్తున్నారు. ఇలా అయితే కష్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నారు.
