Konathala Ramakrishna: ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. వచ్చే నెలలో ముహూర్తాలు అధికంగా ఉండడంతో.. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈసారి జనసేనకు ప్రాతినిధ్యం పెరుగుతుంది అన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సైతం మరో మంత్రి పదవి ఇస్తారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అయితే చేర్పులు మార్పులతో కొత్తవారిని తీసుకుంటారు అన్న టాక్ ఉంది. ఈసారి సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. అయితే జనసేన నుంచి సీనియర్ గా ఉన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఆయనకు ఈసారి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. జనసేన లో ఉన్న సీనియర్ నేత ఆయన ఒక్కరే. అందుకే ఆయనకు అమాత్య పదవి దక్కుతుందని నాకు నడుస్తోంది.
* సుదీర్ఘ నేపథ్యం..
1980 లోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు కొణతాల రామకృష్ణ. 1989లో తొలిసారిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 9 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. 1991లో మళ్లీ ఎంపీగా గెలిచారు రామకృష్ణ. 1996లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచేసరికి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 2009లో మాత్రం ఓడిపోయారు త్రిముఖ పోటీలో. అక్కడి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున అనకాపల్లి నుంచి గెలిచారు. ఈసారి కొణతాలకు తప్పకుండా క్యాబినెట్లో తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది.
* సౌమ్యుడిగా గుర్తింపు..
సీనియర్ రాజకీయ నేతగా మంచి గుర్తింపు ఉంది. సౌమ్యుడిగా పేరు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేయించడంలో రామకృష్ణ పాత్ర ఉంది. కానీ క్రమేపి కొణతాల రామకృష్ణను నిర్లక్ష్యం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. కానీ అనూహ్యంగా జనసేనలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం జనసేనలో సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆయనే. అందుకే పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణను తప్పనిసరిగా మంత్రివర్గంలోకి తీసుకునేలా చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెలలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అందులో ఆయనకు పదవి దక్కడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

