YS Jaganmohan Reddy :  ప్రజా బలం లేదు.. నేతలకు నమ్మకం లేదు.. క్లిష్ట పరిస్థితుల్లో జగన్

అధికారంలో ఉంటే తప్పులు కనిపించవు. తప్పిదాలు సరిచేసుకోరు. వాటి మూల్యం ఎన్నికల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ మూల్యం చెల్లించుకుంటోంది వైసిపి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదురుకానంత ఇబ్బందులు జగన్ ఫేస్ చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : September 25, 2024 1:09 pm

YS Jaganmohan Reddy

Follow us on

YS Jaganmohan Reddy : వైసిపి ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు జగన్. ఆ సమయంలో కూడా ఆయన పెద్దగా భయపడలేదు. సిబిఐ కేసులు వెంటాడినా వెనక్కి తగ్గలేదు. దానికి కారణం ప్రజాబలం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మరి పోటీ చేయించారు. సత్తా చాటారు. 2014 ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా నిలబడ్డారు. 67 సీట్లతో సత్తా చాటారు. నాటిటిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరారు.2014 నుంచి 2019 మధ్య బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజా మద్దతు కూడగట్టారు. 2019 ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించారు. ఏకంగా క్లీన్ స్వీప్ చేశారు. కానీ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. ఇన్నేళ్ల పాటు ప్రజాబలం పొంది.. ఇప్పుడు అదే ప్రజల నుంచి తిరస్కరణకు గురయ్యారు.

* అధికార పక్షానికి ధీటుగా
2014 నుంచి 2019 మధ్య ప్రతిపక్ష పాత్ర పోషించారు జగన్. పేరుకే ప్రతిపక్షం కానీ.. అధికార పక్షం అన్నట్టు వ్యవహరించేవారు. చివరకు అసెంబ్లీలో సైతం అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్న రీతిలో ఉండేవారు. ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. అటు జాతీయ స్థాయిలో సైతం జగన్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. 2019 ఎన్నికల్లో గెలిచేసరికి జాతీయ స్థాయిలో సైతం జగన్ మేనియా అమాంతం పెరిగింది.అప్పటివరకు చంద్రబాబు అంటేనే జాతీయస్థాయి నేత. కానీ జగన్ కు 151 అసెంబ్లీ సీట్లు లభించడంతో జగన్ స్థాయి సైతం పెరిగింది.

* ఎమ్మెల్యేలు ఫిరాయించినా
2014 ఎన్నికల్లో వైసిపి ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. ఆ సమయంలో పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు.అయినా సరే జగన్ వెనక్కి తగ్గలేదు.ప్రజల్లోకి బలంగా వెళ్లారు. ప్రజామోదం పొందారు.సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు.అన్ని వర్గాల ప్రజలను కలిశారు.వారి మనసును గెలిచారు.అత్యధిక స్థానాలతో అధికారంలోకి వచ్చారు.గత ఐదేళ్లుగా తిరుగులేని నేతగా వ్యవహరించారు.అయితే ఇన్ని సంవత్సరాలు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్ని రోజులు తిరుగులేని ప్రజామోదం పొందగలిగిన జగన్.. ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

* గతం మాదిరిగా చెబితే కుదరదు
వన్ చాన్స్ అన్న నినాదం 2019లో పనిచేసింది. మరోసారి అలా పిలుపు ఇస్తానంటే కుదిరే పని కాదు. గత ఐదేళ్లుగా వైసిపి పాలన చూసి.. ప్రజలు ఓటు వేశారు. కనీస స్థాయిలో కూడా జగన్ కు మద్దతు తెలపలేదు. ఏకపక్షంగా జగన్ వ్యతిరేకులను ఆదరించారు ప్రజలు. అయితే వైసీపీకి ఇంతటి పరాజయం ఎదురు కావడంతో.. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదన్న వారు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. కనీసం తమ వద్ద విలువైన పదవులు ఉన్నాయని కూడా వారు భావించడం లేదు. వాటిని వదులుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు అంటే.. వైసీపీలో సీన్ ఏ మాదిరిగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది.