YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో మైనస్ ఉన్న నేతలను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. లేకుంటే మాత్రం పార్టీకి లైఫ్ ఉండదని స్పష్టం చేస్తున్నారు. పుంజుకునే ఛాన్స్ లేదని కూడా చెబుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అటువంటి నేతల విషయంలో ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ ముద్ర కలిగిన నేతలు అందర్నీ పక్కన పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఫైర్ బ్రాండ్ అంటే సబ్జెక్టు పై మాట్లాడి.. ప్రజా సమస్యలను ప్రస్తావించే వారిని ఫైర్ బ్రాండ్ అంటారు. దురదృష్టవశాత్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. బూతులు మాట్లాడే వారిని, ప్రత్యర్థులను తిట్టేవారిని ఫైర్ బ్రాండ్ ట్యాగ్ తగిలించారు.
* సీనియర్ల అసంతృప్త కామెంట్స్..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు బాహటంగానే కొన్ని అసంతృప్త వ్యాఖ్యలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు నోరు విడిచి కామెంట్స్ చేశారు. తమ పార్టీ నేతలు మాదిరిగా హుందా తప్పి రాజకీయాలు చేయనంటూ వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు కామెంట్స్ ను ఉదహరించారు. అలా మాట్లాడను అంటూ తేల్చి చెప్పారు. తద్వారా అటువంటి మాటలు తప్పు అని సంకేతాలు పంపించారు. జగన్ ప్రోత్సాహంతో దూకుడు కలిగిన నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. దాని ప్రభావం మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైంది. విపరీతమైన ప్రభావం చూపి పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయినా సరే అటువంటి నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. అందుకే సీనియర్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అటువంటి నేతలను తప్పిస్తే తప్ప పార్టీకి మనుగడ లేదని హెచ్చరిస్తున్నారు.
* వారిని పక్కన పెడితేనే..
ఫైర్ బ్రాండ్ నేతలు అంటే ప్రజా సమస్యలపై తమదైన రీతిలో స్పందించేవారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు వేరు. ఒక కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు తమ మాట తీరితో.. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ ముద్ర దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు వారి వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంతటి ఓటమి అని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. వారిని పక్కన పెడితే తప్ప రాజకీయాలు చేయలేమన్నట్టు తేల్చి చెబుతున్నారు. అందుకే ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. వారిని పక్కన పెడతారని కూడా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వారి కి టికెట్లు దక్కవన్న టాక్ నడుస్తోంది. దాదాపు అందరికీ మొండి చేయి చూపడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.







