YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్పష్టతపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మొన్న అమరావతి రైతుల కోసం వెళ్ళిన వైసీపీ నేతల పరిస్థితి తెలిసింది. సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతి ప్రాంతంలో పర్యటించారు వైసీపీ నేతలు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న అమరావతి రైతులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా రైతులు అయితే వెంట పడ్డారు. కోడిగుడ్ల దాడి కూడా జరిగింది. అయితే ఈ ఊహించని పరిణామంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. తమపై హత్యాయత్నం జరిగిందని రాజకీయ ప్రకటనలతో సరిపెట్టుకున్నారు. అయితే ఆ నేతలంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అటువంటప్పుడు తమను ఎందుకు పరామర్శకు పంపారు అని బాధపడుతున్నారు.
* సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో..
సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని.. వైసిపి ముఖ్యులు తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి వారు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అయితే అక్కడి రైతులు వీరిని అడ్డుకున్నారు. అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి రాంబాబు. ఓ సీఐ అయితే తోసేశారు. ఈ క్రమంలో అమరావతి రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కోడిగుడ్లు విసరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయంతో పరుగులు తీశారు. తరువాత ఆ బాధిత వైసిపి నేతలు అంతా మీడియా ముందుకు వచ్చారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని.. జగన్మోహన్ రెడ్డికి సైతం ఆ భావన లేదని.. ఆ ప్రాంత రైతులకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అక్కడకు రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ మా రాజధాని స్టాండ్ అంటూ తేల్చేయడంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
* అలవాటైన విద్య..
తన రాజకీయం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల భవిష్యత్తును పణంగా పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిన విద్య. కచ్చితంగా ఇప్పుడు పరామర్శకు వెళ్లిన నేతలపై రాజకీయ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు అమరావతి రాజధానికి జై కొడుతున్నారు. ఇప్పుడు సిఆర్డిఏ పరిరక్షణ పేరుతో వచ్చిన వైసీపీ నేతలు అంతా ఆ రెండు జిల్లాలకు చెందిన వారే. అమరావతి పై జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాను వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తమ ప్రాంతానికి చెందిన నేతలు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారని భావిస్తున్నారు. మరోసారి వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తమ రాజకీయ ఎదుగుదల కష్టమని అలా వెళ్ళిన నేతలంతా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

