YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఎటువంటి సూచనలు, అభిప్రాయాలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడం పై ఎక్కువమంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్ణయాల్లో కనీసం భాగస్వామ్యం కల్పించడం లేదు సీనియర్లకు. ఇప్పుడు కూడా ఆ నలుగురే అన్నట్టు పరిస్థితి ఉంది. ఇటీవల మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు రాజధాని విషయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది మొన్నటి ఎన్నికల్లో. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా.. పదే పదే దాని జోలికి వెళ్తూ అనవసరంగా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పై సీనియర్లకు ఉన్న అభిప్రాయం. ఆపై కుల వివాదాలు కూడా ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర పార్టీపై పడుతోంది. ఇటీవల మతంపై, హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో సీనియర్లు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ఇక ఉండలేం అని తేల్చి చెబుతున్నారు.
* రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు సైతం పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానం.. కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోవడం.. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం.. తదితర కారణాలతో జగన్ వెంట ఉండిపోయారు. అటువంటి వారు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ దానిని అచేతనంగా ఉంచేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఒక్కసారిగా కూడా ఆ కమిటీ సమావేశం అయిన దాఖలాలు లేవు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సీనియర్లను కలవడం తప్ప.. ఎప్పటికప్పుడు పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ అత్యున్నత కమిటీ సమావేశం కావడం లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
* అత్యున్నత కమిటీ ఉన్న..
ప్రస్తుతం ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సభ్యులుగా తమ్మినేని సీతారాం, ముద్రగడ పద్మనాభం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి సీనియర్లు 33 మంది వరకు ఉన్నారు. కానీ ఒక్క నిర్ణయంలో కూడా ఈ కమిటీ భాగస్వామ్యం లేదు. ఇప్పటికీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒకరిద్దరూ తప్ప.. మిగతా వారికి అస్సలు విధానపరమైన నిర్ణయాలు అస్సలు చోటు లేదు. దీంతో సీనియర్లంతా రగిలిపోతున్నారు. అటువంటప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో.. జనసేన సైతం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ రెండు పార్టీల అధినేతలు సీనియర్ల అభిప్రాయాలను గౌరవించి.. వారి అభిప్రాయాలకు పెద్ద పీట వేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
