YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న పెద్ద ఉద్యమాలకు మద్దతు తెలపడం లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చుట్టూ వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. అలాగని గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులు కావు. ఇందులో నేరుగా కూటమి ప్రభుత్వం కలుగజేసుకోవడం లేదు. కానీ ఒక్క వైసీపీ నేతపై కేసు నమోదు అవుతుంది. అరెస్టుల పర్వం నడుస్తోంది. దీనిపైనే వైసీపీలో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీని కొంతమంది నేతలు డ్యామేజ్ చేస్తున్నారన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇది పార్టీ పై ప్రతికూలత చూపుతోందన్న ఆవేదన సీనియర్లలో ఉంది. ఇన్ని రోజులు అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఊరుకున్నామని.. ఇకనుంచి ఊరుకోబోమని వారు చెబుతున్నారు. హెచ్చరించినంత పని చేస్తున్నారు.
* పెద్దిరెడ్డి అసంతృప్తి..
కొద్ది రోజుల కిందట సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలోనే పవర్ఫుల్ నేత ఆయన. మరి ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడడం లేదు అని రిపోర్టర్ ప్రశ్నించేసరికి పెద్దిరెడ్డి వింత సమాధానం చెప్పారు. తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదనతో సంకేతాలు ఇచ్చారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని.. తాను అటువంటిదే కోరుకుంటానని.. తమ పార్టీ నేత అంబటి రాంబాబు లా మాట్లాడను అంటూ చురకలు అంటించారు. అయితే అది అంబటి రాంబాబు నువ్వు ఉద్దేశించింది కాదు. తెర వెనుక జగన్ వైఖరిని తప్పు పట్టడమే దాని ముఖ్య ఉద్దేశం. ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతలు వైసీపీలో అనవసర వ్యాఖ్యలు చేసే నాయకుల వైఖరిని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది.
* కుటుంబ సభ్యుల వైఖరితో..
మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం పాత కేసులను తెరపైకి తెచ్చి వెంటాడింది అని వైసిపి ఆరోపించింది. కానీ ఇప్పుడు ఒక్కో నేత అరెస్టు తీరు చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. కేసులు నమోదు కావడం వెనుక చూస్తుంటే వ్యక్తిగత వ్యవహార శైలి కనిపిస్తోంది. మాజీ మంత్రి అప్పలరాజు వ్యవహరించిన తీరుతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తన కుమారుడు బైక్ రైటింగ్ కారణంగా ఓ మనిషి ప్రమాదానికి గురయ్యారు. కానీ అది తన కొడుకు మెడకు చుట్టుకోకుండా మరో వ్యక్తిని బలిపశువు చేయడానికి చూశారు. దానిని కూడా సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయారు. చివరకు ఆయన అరెస్టు కూడా జరిగిపోయింది. పార్టీకి డ్యామేజ్ మిగిల్చింది. తమ్మినేని సీతారాం గురించి అయితే చెప్పనవసరం లేదు. స్పీకర్ గా ఉంటూనే ఒక భూమి యజమాని బతికుండగానే ఆయన వారసుల పేరుతో నకిలీ ధ్రుపత్రాలు సృష్టించి.. తన కుమారుడి పేరుతో నాలుగు కోట్ల విలువైన భూమిని రాయించుకున్నారు.. సామాన్యులు సైతం దీనిని తప్పుపడుతున్నారు.
* ఏకంగా గృహహింస కేసు..
తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ కేసుల బారిన పడింది. జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు 11 మందిపై కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం, గృహహింస, హత్యాయత్నం వంటి ఆరోపణలు చేస్తూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్ ఫ్యామిలీ కేసుల బారిన పడింది. వీటిని రాజకీయ కక్ష్యలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇది వ్యక్తిగత కేసులు అన్నది ప్రజలకు తెలుసు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా పోరాటాలు చెయ్యకపోగా ఇలా వ్యక్తిగత వైఖరితో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు అనేది సీనియర్ల అభిప్రాయం. అంతకుమించి జగన్ వారిని వెనుకేసుకు రావడం పై కూడా పార్టీలో భిన్న స్వరం వినిపిస్తోంది. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.


