Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి పై విద్యాధికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజా సమస్యలను ప్రస్తావించే క్రమంలో.. కొన్ని వ్యవస్థల విషయంలో చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదని వాదిస్తున్నారు. తాజా గా జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం 16 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది వారంతా ఉద్యోగాల్లో చేరి పాఠాలు కూడా బోధిస్తున్నారు. అయితే ఆ డీఎస్సీ అక్రమం అని జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆరోపించడం చూస్తుంటే.. ఆయన అపరిపక్వతకు అద్దం పడుతోంది. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ పూర్తయి.. నియామకాలు కూడా జరిగిన తరువాత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అర్థంలేని ఆరోపణలు చేయడం ఏంటని విద్యాశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
* 16 వేల ఉపాధ్యాయుల భర్తీ..
గత ఏడాది కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటికే ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం సైతం 6000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ప్రకటించింది కానీ ఎటువంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా చేయలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించింది. అప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ను అడ్డగించే ప్రయత్నం చేశారు. కానీ లోకేష్ పట్టుదలగా వ్యవహరించి డీఎస్సీ నియామక ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి.. 16,000 మందికి ఉద్యోగాలను అప్పగించి వారి కళ్ళల్లో ఆనందం నింపారు. ఇప్పుడు ఏడాది తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని రంగరించి జగన్ కొత్త కథ అల్లుతున్నారు. పైగా డీఎస్సీ వివరాలను ప్రభుత్వం వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే విద్యాశాఖతో పాటు సమాజంపై అవగాహన ఉన్నవారు దీనిని తప్పుపడుతున్నారు.
* తప్పు అని తేల్చిన ఏపీ ఫాక్ట్ చెక్
అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవి తప్పుడు ఆరోపణలుగా తేల్చింది. ప్రభుత్వ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉన్నాయని.. ఎటువంటి డిలీట్ చేయలేదని తేల్చి చెప్పింది. మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. మరో ఏడుపుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో మరో డీఎస్సీ ప్రకటిస్తామని.. ప్రతి సంవత్సరం దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పారని.. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదని.. ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేయలేదని.. ఆయనకు ఏడుపు తప్ప మరొకటి ఎందుకు కనిపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు లోకేష్. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలు విద్యాశాఖ వర్గాల్లో విస్మయం రేపుతోంది. డీఎస్సీ పోస్టుల నియామకం జరపకపోగా ఇటువంటి అడ్డగోలు ఆరోపణలు చేయడం ఏంటనేది ఎక్కువమంది ప్రశ్న.
