spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: ఆ ఇద్దరు మాజీ మంత్రులతో జగన్ కు తలనొప్పి!

YS Jagan: ఆ ఇద్దరు మాజీ మంత్రులతో జగన్ కు తలనొప్పి!

YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా జిల్లాల్లో ఇంకా కోలుకోలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తాం అంటూ ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే నెల్లూరు జిల్లాలో వైసిపి నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. ఎన్నికలకు ముందు చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుడ్ బై చెప్పారు. టిడిపిలో చేరిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలామంది పార్టీని వీడారు. అయితే ఉన్న నేతల్లో సఖ్యత లేదు. సీనియర్ నేతలు మౌనంగా ఉన్నారు. కానీ ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం ఆధిపత్యం కోసం గట్టిగానే తలపడుతున్నారు. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.

* పార్టీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తూ వస్తోంది నెల్లూరు జిల్లా. రాజకీయంగా పేరు మోసిన కుటుంబాలన్నీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాయి. పెద్దపెద్ద నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసేవారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలంతా ఎంతో నమ్మకంతో పనిచేసే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. కానీ వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్న విమర్శ ఉంది. సీనియర్లుగా, పార్టీకి అండగా నిలిచిన వారిని కాదని జూనియర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో వీరంతా మనస్థాపానికి గురయ్యారు. అడుగడుగునా అవమానాలు పడ్డారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు.

* సీనియర్లపై నిర్లక్ష్యం..
2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఘన విజయం సాధించింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది కానీ.. నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ హవా చాటింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. నెల్లూరులో తన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన జగన్ అండదండలు ఉన్నాయని చెప్పి రెడ్డి సామాజిక వర్గం నేతలపై ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒకానొక దశలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై కూడా వ్యక్తిగత దూషణలకు దిగారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ తన నోటికి పని చెప్పేవారు అనిల్. అలా రెండున్నర సంవత్సరాల పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంఘర్షణ వాతావరణంతో గడిపారు. దీంతో వైసీపీ నేతలు అంతా విసిగి వేసారి పోయారు. తరువాత అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. ఆయన వైఖరి సైతం అలానే ఉండడంతో 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతలు టిడిపిలోకి క్యూ కట్టారు.

* పోటా పోటీగా ప్రకటనలు
2024 ఎన్నికల ఫలితాల్లో టిడిపి స్వీప్ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా వైసీపీ అంటే తనదంటే తనది అని పోటాపోటీగా ప్రకటనలు చేసుకున్నారు. ఈ నేతల ప్రవర్తన చూసి పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకున్నాయి. ఇలా అయితే కష్టమని నిట్టూరుస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular