Vijayasai Reddy  : రాయలసీమకు వైవి సుబ్బారెడ్డి.. విజయసాయి ప్లాన్ వర్కవుట్!

వైసిపి హయాంలో ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ బాధ్యత హాట్ కేక్ లాంటిది. విపరీతమైన పోటీ ఉండేది. అందుకే జగన్ తన సొంత వారిని ఇక్కడ నియమించుకున్నారు. తొలుత విజయసాయి రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయనపై ఆరోపణలు రావడంతో సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. ఇప్పుడు ప్రతికూల ఫలితాలు రావడంతో వైవి పై వేటు వేశారు. తిరిగి ఆ బాధ్యతలు విజయసాయికి అప్పగించారు.

Written By: Dharma, Updated On : October 17, 2024 12:53 pm

Vijayasai Reddy

Follow us on

Vijayasai Reddy   : వైసీపీలో విజయసాయిరెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్.పార్టీ ఆవిర్భావం ముందు నుంచే జగన్ వెంట అడుగులు వేశారు విజయసాయి.ఆయన ఓ సామాన్య ఆడిటర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పనిచేసేవారు. ఈ క్రమంలోనే జగన్ కు దగ్గర అయ్యారు.జగన్ కంపెనీల వ్యవహారాలను చూసేవారు. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్నారు. జగన్ తర్వాత రెండో నిందితుడిగా మారారు. జగన్ తో పాటు 16 నెలల జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయనతో పాటు బెయిల్ దక్కించుకున్నారు.అంతవరకు ఓకే కానీ..వైసిపి ఆవిర్భావం తర్వాత విజయసాయిరెడ్డి హవా ఒక్కసారిగా పెరిగింది.జగన్ కోసం ఎంతో కష్టపడ్డారు.వైసీపీని అధికారంలో తీసుకొచ్చేందుకు తాపత్రయపడ్డారు. ఈ క్రమంలోనే పార్టీలో ఏ2గా ఎదిగారు.కానీ సొంత పార్టీ శ్రేణులకే టార్గెట్ అయ్యారు.ముఖ్యంగా జగన్ కు అత్యంత విధేయులుగా వ్యవహరించిన వారి నుంచే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు.జగన్ సైతం విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గించారు.కానీ పార్టీ అవసరాల దృష్ట్యావిజయసాయిరెడ్డిని మళ్ళీ అక్కున చేర్చుకున్నారు.తాజాగా ఉత్తరాంధ్ర రీజనల్ ఇంచార్జ్ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. గతంలో అదే రీజనల్ ఇంచార్జ్ పదవిని తొలగించి తన బాబాయ్ వై వి సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇప్పుడు బాబాయిని తొలగించి అదే స్థానం విజయసాయికి ఇచ్చారు.

* పెరిగిన హవా
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి హవా పెరిగింది.ఆయనకు జగన్ ఉత్తరాంధ్ర రీజినల్ బాధ్యతలు అప్పగించారు.విశాఖను వైసీపీ పాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విశాఖలో జరిగే కార్యకలాపాలనుపర్యవేక్షించే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు జగన్.ఒక విధంగా చెప్పాలంటే ఇది మంత్రి పదవి కంటే కీలకం.పైగా ఉత్తరాంధ్ర బాధ్యతలు మొత్తం విజయసాయిరెడ్డి భుజస్కందాలపై పెట్టారు.విశాఖకు రాజధాని రాలేదు కానీ.. అదేనగరంలో విజయసాయిరెడ్డి భారీగా దోపిడీకి పాల్పడ్డారు అన్నది సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపించిన మాట.విశాఖలో తనకంటూ ఒక అనుచర వర్గాన్ని పెట్టుకున్నారు విజయసాయి.విజయసాయి రెడ్డి పై భూఆక్రమణల ఆరోపణలు రావడం,సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో జగన్ విజయసాయిరెడ్డిని తప్పించారు.ఆ స్థానంలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు.

* వై వి పై రివెంజ్
అయితే వైవి సుబ్బారెడ్డి నియామకం తరువాత విజయసాయిరెడ్డి అనుచరులపై పడినట్లు వార్తలు వచ్చాయి.వారిని అకారణంగా పార్టీ నుంచి బయటకు పంపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వై వి సుబ్బారెడ్డి విశాఖపై పట్టు సాధించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. విశాఖ తో పాటు ఉత్తరాంధ్రలో పార్టీ పట్టు పెరగాలంటే విజయసాయిరెడ్డి మళ్ళీ రావాలన్న డిమాండ్ వచ్చింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డిని తిరిగి ఉత్తరాంధ్ర రీజనల్ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మొత్తానికైతే విజయసాయిరెడ్డి తాను అనుకున్నది సాధించగలిగారు. తన స్థానంలో వచ్చిన వైవి సుబ్బారెడ్డిని తిరిగి రాయలసీమకు పంపించగలిగారు.